కిమ్ ఆదేశాలు యమ డేంజర్: ఆ దేశ అధికారిని కాల్చి తగలబెట్టిన ఉత్తరకొరియా..!
ఉత్తరకొరియా దక్షిణ కొరియాల మధ్య నిప్పు మరోసారి రాజుకుంది. ఉత్తరకొరియా బలగాలు దక్షిణకొరియాకు చెందిన ఓ అధికారిపై కాల్పులు జరిపి ఆ తర్వాత అతని శరీరాన్ని తగలబెట్టిందని దక్షిణ కొరియా మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరకొరియా పాల్పడిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ కొరియా... ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
క్షిపణి ప్రయోగం ద్వారా దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్: ఉత్తరకొరియా మీడియా
సముద్ర జలాల్లో మృతదేహం
దక్షిణకొరియా మత్స్యశాఖ అధికారి ఒకరు సముద్ర సరిహద్దుల్లో పొరపాటున నిబంధనలు అతిక్రమించినందుకు ఉత్తరకొరియా దళాలు కాల్చి చంపినట్లు వచ్చిన వార్తలు వాస్తవమే అని దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించింది. ఇక చనిపోయిన అధికారి మృతదేహం సముద్ర జలాల్లో దక్షిణ కొరియా కనుగొంది. ముందుగా అతన్ని కాల్చి ఆపై తగలబెట్టారని దక్షిణ కొరియా రక్షణశాఖ వెల్లడించింది. ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందో ఉత్తరకొరియా వివరణ ఇవ్వాలని దక్షిణ కొరియా మిలటరీ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు ఉత్తరకొరియా పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది.
సరిహద్దులు దాటినందుకేనా..
మత్స్యకారుల పాట్రోలింగ్ బోట్లో వెళ్లిన అధికారి సోమవారం నుంచి కనిపించడం లేదు. నార్తర్న్ లిమిట్ లైన్కు దక్షిణాన 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లారు. ఈ నార్తర్న్ లిమిట్ లైన్ సముద్రంలో రెండు దేశాలకు సరిహద్దుగా ఉంది. దీనికి సమీపంలోకి వెళ్లడంతోనే ఉత్తరకొరియా సైన్యం ఇతన్ని కాల్చివేసిందనే వార్తలు వస్తున్నాయి. అయితే అసలు అతన్ని ఎందుకు కాల్చివేసిందనే దానిపై మాత్రం పూర్తి స్పష్టత లేదు. అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియా... పక్క దేశం నుంచి ఒక వ్యక్తి రావడాన్ని గమనించి కాల్చివేసి ఉంటుందని స్థానికి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
కరోనా నేపథ్యంలో కిమ్ ఆదేశాలు
ఇదిలా ఉంటే తమ భూభాగంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలను కిమ్ జాంగ్ ఉన్ ఇచ్చినట్లు కొద్ది రోజుల క్రితం అమెరికా మిలటరీ కమాండర్ దక్షిణకొరియాలో చెప్పారు. దేశంలోకి కరోనావైరస్ రాకూడదనే ఈ నిర్ణయం కిమ్ తీసుకున్నట్లు ఆ అమెరికా మిలటరీ కమాండర్ వివరించారు. ఇదిలా ఉంటే ఎక్కువగా ఉత్తరకొరియా నుంచే దక్షిణ కొరియాకు చాలామంది రహస్యంగా వస్తుంటారు. మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లాడు. అయితే దక్షిణ కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ఈ ఏడాది జూలైలో తిరిగి ఉత్తరకొరియాకు చేరుకున్నాడు. ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. ఈ వ్యక్తి వచ్చాడని తెలియగానే ఉత్తరకొరియా అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే కేసాంగ్ నగరం సరిహద్దులను మూసివేసి దాదాపు వెయ్యిమందిని క్వారంటైన్లో ఉంచారు.