అబ్కీ బార్ ట్రంప్ సర్కార్: భారత్ కు ఆహ్వానం: మోదీ బహిరంగ మద్దతు...!!
ప్రధాని మోదీ అమెరికాలో ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్..అంటూ పిలుపునిచ్చారు. అమెరికా అధినేతను ప్రవాస భారతీయులకు తన దైన శైలిలో పరిచయం చేసారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన మోదీ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా తనను ఆహ్వానిస్తే వచ్చే నెలలో ముంబైలో జరిగే ఎన్బీఏ ఫుట్ బాల్ మ్యాచ్ కు వస్తానని ట్రంప్ చెప్పగా..మోదీ తన ప్రసంగం ముగింపులో ట్రంప్ ను భారత్ కు ఆహ్వానించారు. ట్రంప్ సేవలను..ఆయనతో తమకు ఉన్న స్నేహాన్ని వివరించిన మోదీ... ఉగ్రవాదం విషయంటో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు లేచి నిలబడి కరతాల ధ్వనులతో మోదీ మద్దతు ప్రకటించారు. అమెరికాలో ట్రంప్ మరో సారి అధికారంలోకి రావాలంటూ మోదీ బహిరంగంగా పిలుపు నివ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ట్రంప్ కు మద్దతుగా మోదీ ప్రచారం..
హ్యూస్టన్లో జరిగిన చారత్రాత్మిక కలయికలో ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ఊహించని విధంగా పిలుపునిచ్చారు. అమెరికాలో మరోసారి ట్రంప్ అధికారంలోకి రావాలని అభిలషించారు. సభా ప్రాంగణాని కి ఆలస్యంగా చేరుకున్న ట్రంప్ తో కలిసి మోదీ వేదిక మీదకు వచ్చారు. ఆ వెంటనే తొలుత ఇంగ్లీషులో మోదీని అభినందిస్తూ ప్రసంగించారు. ఆ సమయంలో వేలాదిగా తరలి వచ్చిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ను పరిచయం చేసారు. ఈరోజు మనతో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయనకు పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన పేరు ప్రపంచ రాజకీయాల్లోని ప్రతి సంభాషణలోనూ వస్తుంది.
ప్రతి రంగంలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకమాయన. అమెరికాను మరోసారి గ్రేట్ చేయాలని తపిస్తున్నారు. ప్రతి అమెరికన్ గురించి ఆయన ఆలోచిస్తారు. అమెరికాకు, ప్రపంచానికి ఆయన ఎంతో సాధించారు. ఆయనే డొనాల్డ్ ట్రంప్...అంటూ మోదీ పరిచయం చేసారు. అమెరికాలోని శ్వేతసౌధంలో భారత్కు నిజమైన స్నేహితుడని అభివర్ణించారు. ఇటీవలి కాలంలో రెండు దేశాల సంబంధాలు కొత్త ఎత్తులకు వెళ్లాయని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరిగి నిలబెట్టారని కొనియాడారు. మరోసారి ట్రంప్ ప్రభుత్వమమే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
గంట ఆలస్యంగా వచ్చిన ట్రంప్..భారత్ కు ఆహ్వానం
హ్యూస్టన్లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమం పైన అమెరికా..భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా తిలకించాయి. ఈ సమావేశంలో ముందుగా నిర్ణియించిన షెడ్యూల్ కంటే అమెరికా అధినేత ట్రంప్ గంట ఆలస్యంగా వచ్చారు. మోదీ తో కలిసి ట్రంప్ వేదిక మీదకు వచ్చే విధంగా తొలుత షెడ్యూల్ ఖరారు చేసారు. అయితే.. అయింది. హ్యూస్టన్ విమానాశ్రయంలో దిగి ఎన్ఆర్జీ స్టేడియంకు వస్తూ మార్గమధ్యలో ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆగారు. హ్యూస్టన్లో కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరద పరిస్థితిని సమీక్షించారు. వరదల కారణంగా ఐదుగురు పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో నేరుగా హౌడీ మోడీ వేదిక వద్దకు వెళ్లడం బాగోదని భావించిన ఆయన మధ్యలో ఆగి అధికారులతో పరిస్థితి పైన ఆరా తీసారు. ఆ సమయంలో అమెరికన్ ప్రతినిధులు మోదీకి స్వాగతం పలికారు.
ట్రంప్ తన ప్రసంగంలో
భారత్ తో అమెరికా కు ఉన్న సత్సంబంధాలను వివరించారు. ఇక..ట్రంప్ తన ప్రసంగంలో ఎన్బీఏ ఫుట్బాల్ను భారత్కు పరిచయం చేయనున్నామని, వచ్చే నెలలో ముంబైలో ఎన్బీఏ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుందని ట్రంప్ తెలిపారు. మోదీ ఆహ్వానిస్తే భారత్కు వస్తానని పేర్కొన్నారు. దీని పైన ప్రధాని మోదీ తన ప్రసంగం చివర్లో స్పందించారు. భారత్ కు రావాలంటూ ట్రంప్ ను ఆహ్వానించారు. దీంతో..వచ్చే నెలలో అమెరికా అధినేత ట్రంప్ భారత్ లో పర్యటించే అవకాశం ఉంది.