ట్రంప్ మద్దతుదారుల దాడిపై మోడీ గుస్సా, ఖండన, బిడెన్కు స్నేహహస్తం..
అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడి అనేది శాంతియుతంగా జరగాలీ కానీ.. హింసాత్మక పరిస్థితులకు దారితీయడం సరికాదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కేపిటల్ హిల్లో జరిగిన ఘటనను ఇతర దేశాధినేతలు కూడా ఖండించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, కెనాడ ప్రధాని జస్టిన్ ట్రుడో, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసండి ఆర్డాన్ కూడా తప్పుపట్టారు. ఇదీ సరికాదని.. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక జరిగాక గౌరవించాలని స్పష్టంచేశారు.
వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం(కేపిటల్ బిల్డింగ్)లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోతతో పార్లమెంట్ బిల్డింగ్ దద్దరిల్లింది. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఘటనలో నలుగురు చనిపోగా.. 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. తన ఓటమిని అంగీకరించబోనని ప్రకటించడంతో ట్రంప్ మద్దతుదారులు రెచ్చిపోయారు.
అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీలు ఉండగా.. బిడెన్ 306 గెలుచుకున్నారు. ట్రంప్ 232 ఓట్లకే పరిమితమయ్యారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఎన్నికలపై న్యాయ పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారుల దాడిని మోడీ ఖండించారు. దీంతో ట్రంప్కు దూరంగా.. బిడెన్కు మోడీ దగ్గర అవుతున్నారని అర్థమవుతోంది.