3 రంగుల బెలూన్లతో ఆస్ట్రేలియాలో మోడీ ఎక్స్ప్రెస్ రెడీ
సిడ్నీ: మెల్బోర్న్ నుండి సిడ్నీకి మోడీ ఎక్స్ప్రెస్ పేరిట ఓ ప్రత్యేక రైలు ప్రయాణించనున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా రైల్వే చరిత్రలో ఒక భారత ప్రధాని పేరిట రైల్వే సర్వీస్ నడపటం ఇదే తొలిసారి! సిడ్నీలో సోమవారం నాడు జరిగే భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సుమారు 200 మందికి పైగా ఈ రైలులో మెల్బోర్న్ నుండి వెళ్లనున్నారు.
దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని బీజేపీ, మోడీ అభిమానులు ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసుకున్నారు. రైలులోని అన్ని టికెట్స్ బుక్ అయిపోయాయని ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మెల్బోర్న్ అధ్యక్షులు అశ్విన్ బోరా వెల్లడించారు.
స్థానిక రైల్వే అధికారుల సహకారంతో రైలును మూడు రంగుల బెలూన్లు, మోడీ చిత్రాలు, వివిధ రకాల పోస్టర్లతో అలంకరించనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నామని, మోడీ డోక్లా, ఫఫ్డా తదితరాలతో మెనూను సిద్ధం చేశామన్నారు. ఈ రైలు ఆదివారం సాయంత్రం నాలుగు బోగీలతో, దాదాపు రెండువందల ఇరవై మందితో బయలుదేరనుంది.
కాగా, భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా మోడీ హవా కనిపిస్తోంది. ఇటీవల మోడీ విదేశీ పర్యటనలు విజయవంతమయ్యాయి. తాజాగా ఆయన మయన్మార్లో పర్యటిస్తున్నారు. అనంతరం ఆస్ట్రేలియా వెళ్తారు. మోడీ అమెరికా పర్యటన గురించి స్థానిక పత్రికలు ప్రధానంగా వార్తలు రాశాయి. ఇక, ఎన్నారైల అభిమానానికి అంతేలేకుండా పోయింది. న్యూయార్క్లోని మాడిసన్ స్క్కేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.
ఇప్పుడు జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ నవంబర్ 15న అస్ట్రేలియాలోని బ్రిస్బన్లో అడుగుపెట్టనున్నారు. అనంతరం నవంబర్ 17న అక్కడి భారత సంతతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని భారత సంతతి ఓ అరుదైన ఘట్టానికి తెర తీసిన విషయం తెలిసిందే.
మోడీ ఎక్స్ప్రెస్ పేరిట ప్రత్యేక రైలును మెల్బోర్న్ నుంచి సిడ్నీకి పరుగులు తీయించనున్నారు. 870 కిలో మీటర్ల మేర ప్రయాణించనున్న మోడీ ఎక్స్ప్రెస్లో కేవలం 220 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది.
ఇది తెలిసి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. నాలుగు బోగీల మోడీ ఎక్స్ప్రెస్లో 220 మందికి మాత్రమే ప్రవేశం కల్పించారు. 2011 ఆస్ట్రేలియా సెన్సస్ ప్రకారం.. 2,95,300 మంది భారత దేశంలో జన్మించిన వారు ఉన్నారు. అలాగే 3,90,900 మంది భారత సంతతికి చెందిన వారు ఉన్నారు.