మెల్బోర్న్ టు సిడ్నీ: ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ప్రెస్'
న్యూఢిల్లీ/సిడ్నీ: భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కనిపిస్తోంది. ఇటీవల మోడీ అమెరికా పర్యటన విజయవంతం కావడమే కాకుండా, ఆ దేశంలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. స్థానిక పత్రికలు మోడీ గురించి ప్రధానంగా వార్తలు రాశాయి. ఇక, ఎన్నారైల అభిమానానికి అంతేలేకుండా పోయింది. న్యూయార్క్లోని మాడిసన్ స్క్కేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.
తాజాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ నవంబర్ 15న అస్ట్రేలియాలోని బ్రిస్బన్లో అడుగుపెట్టనున్నారు. అనంతరం నవంబర్ 17న అక్కడి భారత సంతతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని భారత సంతతి ఓ అరుదైన ఘట్టానికి తెర తీశారు.
మోడీ ఎక్స్ప్రెస్ పేరిట ప్రత్యేక రైలును మెల్బోర్న్ నుంచి సిడ్నీకి పరుగులు తీయించనున్నారు. 870 కిలో మీటర్ల మేర ప్రయాణించనున్న మోడీ ఎక్స్ప్రెస్లో కేవలం 220 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. ఇప్పటికే వెయ్యిమందికి పైగా దీనిలో ప్రయాణించేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే నాలుగు బోగీల మోడీ ఎక్స్ప్రెస్లో 220 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అధికార ప్రతినిధి బాలేశ్ సింగ్ ధన్కార్ తెలిపారు. 2011 ఆస్ట్రేలియా సెన్సస్ ప్రకారం.. 2,95,300 మంది భారత దేశంలో జన్మించిన వారు ఉన్నారు. అలాగే 3,90,900 మంది భారత సంతతికి చెందిన వారు ఉన్నారు.
హృతిక్ రోషన్ను మోడీ అభినందన
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ను నరేంద్ర మోడీ అభినందించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఎంతోమందిలో స్పూర్తిని రగిలించారని, హృతిక్ చేసిన ఈ పని నుంచి ఆయన అభిమానులంతా స్పూర్తిని పొంది ఉంటారని మోడీ ట్వీట్ చేశారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జూహూలోని తన నివాసం సమీపంలోని వీధుల్లో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హృతిక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చాలా నేర్చుకున్నానని ట్వీట్ చేశారు. దేశాన్ని, నగరాన్ని, వీధులను, నివాసంలో శుభ్రం చేసుకోవడంలో ఉన్న ఆనందం చూశాక మంచి నిర్ణయం తీసుకున్నానని ఆయన ట్విట్టర్లో తెలిపారు.