ప్రధాని మోడీ ప్రత్యేక కానుక: భారత్ పై యూన్ చీఫ్ ప్రశంసలు
న్యూయార్క్: భారతదేశం పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రశంసల వర్షం కురిపించారు. పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందంటూ కితాబిచ్చారు.
ఐరాసకు భారత్ ప్రత్యేక కానుక
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి 193 సోలార్ స్లేట్స్ తో కూడిన సోలార్ పార్క్ ను బహూకరించారని, ఇవి ఐక్యరాజ్యసమితికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాగా, ఈ సోలార్ పార్కును మోడీ ప్రారంభించనున్నారు.
భారత్ది కీలక పాత్ర
అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో అత్యంత కీలకమైన పాత్ర భారత్ పోషిస్తోందని కొనియాడారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు సమకూర్చుకోవడంలో భాగంగా భారత్ సౌర విద్యుత్ పై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం మంచి పరిణామమని చెప్పారు. క్లీన్ ఇండియా కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో ప్రభావంతంగా ఉన్నాయని ప్రశంసించారు.
ప్రసంగించనున్న మోడీ..
తమ అవసరా కోసం మోడీ ప్రభుత్వం సైతం అణు ఇంధనంపై దృష్టి సారించిందని, ఐక్యరాజ్యసమితి దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా, సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్, భారత ప్రధాని మోడీ సహా పలువురు ప్రసంగించనున్నారు.