స్నేహం బలోపేతం: ఇండోనేషియాలో మోడీ, అధ్యక్షుడితో భేటీ
జకార్తా: ఇటీవలే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా... మంగళవారం ఇండోనేసియా చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తీర పొరుగు దేశంతో రాజకీయ, ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని ఈ పర్యటన చేపడుతున్నారు.
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో భారత ప్రధాని మోడీ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. సముద్ర వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై వారిరువురూ చర్చించారు. కాగా, ఇండోనేసియా వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య- భారతీయ పరిశ్రమల సమాఖ్యలు సంయుక్తంగా ఏర్పాటుచేసే 'ఉభయ దేశాల సీఈవో ఫోరం' సహా పలు సమావేశాల్లో నేతలిద్దరూ పాల్గొంటారు.
అంతకుముందు తన పర్యటన గురించి మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'జకార్తాలో దిగాను. భారత్-ఇండోనేసియాలు లోతైన నాగరిక వారసత్వ సంబంధాలున్న తీర పొరుగు దేశాలు. ఈ పర్యటన ఉభయదేశాల నడుమ రాజకీయ, ఆర్థిక సంబంధాల బలోపేతానికీ, వ్యూహాత్మక ప్రయోజనాలకు తోడ్పడుతుంది. ప్రధానిగా నేనిక్కడకు రావడం ఇదే తొలిసారి. అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చల కోసం నిరీక్షిస్తున్నా ఇండియా-ఇండోనేసియా సీఈవో ఫోరం సదస్సులో ఇద్దరం పాల్గొంటాం' అని తెలిపారు.
అంతేగాక, 'ఇక్కడి(ఇండోనేషియా) భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నా. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న స్వేచ్ఛా సమాజాలుండటం రెండు దేశాల ప్రత్యేకత. నా పర్యటనతో ఆసియాలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల నడుమ ద్వైపాక్షిక బంధం బలపడుతుందనీ, విస్తృత సమష్టిత్వం ఏర్పడుతుందని విశ్వసిస్తున్నా' ప్రధాని మోడీ పేర్కొన్నారు.
మహాభారత ఘట్టాన్ని ప్రతిబింబించే ప్రఖ్యాత 'అర్జున విజయ' శిల్పాన్ని అధ్యక్షుడు జోకోతో కలిసి మోడీ బుధవారం సందర్శించనున్నారు. గురువారం ఇండోనేసియా నుంచి సింగపూర్కు వెళ్తూ మార్గ మధ్యంలో కౌలాలంపూర్లో కాసేపు ఆగుతారు. అక్కడ మలేసియా నూతన ప్రధాని మహాతిర్ మహమ్మద్కు మోడీ అభినందనలు తెలియజేస్తారు.
జూన్ 1న సింగపూర్లో జరిగే వార్షిక భద్రతా సమావేశం 'షాంగ్రి-లా డైలాగ్'లో మోడీ కీలకోపన్యాసం చేయనున్నారు. 'ఈ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడనుండటం ఇదే తొలిసారి. ప్రాంతీయ భద్రత, శాంతి-స్థిరత్వ పరిరక్షణపై మన దేశ దృక్పథాన్ని వినిపించేందుకు ఇదో గొప్ప అవకాశం' అని మోడీ వ్యాఖ్యానించారు.
పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్తో మోడీ భేటీ అవుతారు. ఆ దేశ ప్రధాని లీ సెయిన్ లూంగ్తో దౌత్యస్థాయి చర్చలు జరుపుతారు. 1948, మార్చి 27న గాంధీజీ అస్థికలను సముద్ర జలాల్లో కలిపిన 'క్లిఫోర్డ్ పీర్' వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని భారత ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.