చిన్న పిల్లాడినడిగినా రష్యానే: మోడీ, పుతిన్ అభినందన
ఫోర్టాలెజా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాతో విస్తృత భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోడీ రష్యా ప్రధాని వ్లాదిమర్ పుతిన్ను కలిశారు. ఆయనతో పలు అంశాల పైన చర్చించారు. అణు, రక్షణ, ఎనర్జీ రంగాలలో రష్యాతో విస్తృత భాగస్వామ్యాన్ని మోడీ ఆశిస్తున్నారు.
ఇందులో భాగంగా డిసెంబర్ ఆనువల్ సమ్మిట్కు వచ్చిన సమయంలో కూడంకుళం అణు ప్రాజెక్టును సందర్శించాలని పుతిన్ను మోడీ కోరారు. మోడీ, పుతిన్లు గత రాత్రి నలభై నిమిషాల పాటు భేటీ అయ్యారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించినందుకు మోడీకి పుతిన్ అభినందనలు తెలియజేశారు. కాగా, గతంలో పుతిన్ను మోడీ 2001లో మాస్కోలో కలుసుకున్నారు.
పుతిన్తో భేటీ నేపథ్యంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. మొదటి నుండి రష్యా భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మోడీ హిందీలో మాట్లాడుతూ... భారత్కు మంచి స్నేహపూర్వక దేశమేదని భారతదేశంలో చిన్న పిల్లాడిని అడిగినా కూడా రష్యా అని చెబుతారని అన్నారు. ఎందుకంటే భారత్ సంక్షోభాల్లో ఉన్న సమయంలో రష్యా ఎప్పుడు అండగా నిలిచిందన్నారు.