మోడీకి స్టార్లా స్వాగతం, షరీఫ్ ఆయన్ని చూడు: పాక్ మీడియా
లాహోర్: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ సినిమా స్టార్లా స్వాగతం లభించిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. నరేంద్ర మోడీ ప్రత్యర్థులను కూడా తలదన్నేలా ఉంటున్నారని పాకిస్తాన్ మీడియా అభిప్రాయపడింది.
పాకిస్తాన్లోని పలు పత్రికలు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన విశేషాలను బాగా కవర్ చేశాయి. మోడీకి సినిమా స్టార్లా స్వాగతం లభించిందని, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు మాత్రం కేవలం ఐక్యరాజ్య సమితిలో మాత్రమే మాట్లాడే అవకాశం లభించిందని ది నేషన్ పత్రిక పేర్కొంది.
ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లారు. అయితే, ప్రధాని మోడీకి ఫేస్బుక్, గూగుల్ తదితర సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు ఎన్నారైల నుంచి కూడా ఘన స్వాగతం లభించింది.
ప్రధాని మోడీ మాట్లాడిన మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. మోడీ సిలికాన్ వ్యాలీలోని దిగ్గజాలను కలవడంతో పాటు ఫేస్బుక్ లాంటి సంస్థలకు కూడా వెళ్లి గడిపారు. అక్కడ జుకర్ బర్గ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని పాక్ మీడియా పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పలు వేదికల పైన స్టార్లా స్వాగతం లభించిందని, పాక్ ప్రధాని షరీఫ్కు మాత్రం కేవలం ఐక్యరాజ్య సమితి ప్లాట్ ఫాం పైనే మాట్లాడే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇది పాక్ వ్యతిరేక తీరుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
అక్కడ పాక్ ప్రధాని షరీఫ్ ఏం చేస్తున్నారని ఓ పాక్ డెయిలీ ప్రశ్నించింది. భారత ప్రధాని మోడీ మాత్రం... సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు, పాకిస్తాన్ ప్రధాని మోడీ తీరును గుర్తించాలని సూచించింది. తద్వారా ఆయన దారిలో నడవాలని అభిప్రాయపడింది.