మోడీ ఏడాది పాలనపై పెదవి విరిచిన అమెరికా మీడియా
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఏడాది పాలన పైన అమెరికా మీడియా విమర్శలు గుప్పించింది. మోడీ చెబుతున్న మేకిన్ ఇండియా కేవలం ఓ హైప్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఎన్డీయే ఏడాది పాలనపై అమెరికా మీడియా పెదవి విరిచింది.
మేక్ ఇన్ ఇండియాకు మోదీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ అది ప్రచారానికే పరిమితమైందని విమర్శించింది. ఉద్యోగ కల్పనపై భారీ అంచనాలు పెట్టుకున్నా జాబ్ మార్కెట్ ఇప్పటికీ స్తబ్ధుగానే ఉందని వ్యాఖ్యానించింది.
వాల్స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆర్థికాభివృద్ధిని పునరుజ్జీవింపచేయడానికి, మార్పు కోసం ప్రజలు మోడీకి అధికారం ఇచ్చారని, కానీ, ఆ ఆశలు అడియాసలు అవుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ కుంటినడక నడుస్తోందని పేర్కొంది.
కేపిటల్ ఇన్వెస్ట్మెంట్కు ద్రవ్యోల్బణ ఆధారిత రుణాలు 2004 నుంచి ఎన్నడూ చూడని స్థాయికి దిగజారాయని, వరుసగా ఐదో నెలలోనూ ఎగుమతులు పడిపోయాయని వివరించింది. విదేశాల నుంచి చూస్తే, భారతదేశం ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోందని, స్వదేశంలో మాత్రం, ఉద్యోగాల పెరుగుదల మందకొడిగా ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.