టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో నరేంద్ర మోడీ
న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ 'టైమ్' ప్రదానం చేసే 'ఈ ఏటి మేటి వ్యక్తి' టైటిల్ రేసుకు ఎంపిక చేసిన 42 మంది ప్రపంచ అగ్రగణ్యులలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి స్థానం లభించింది. పలువురు నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో కూడిన ఈ జాబితాలోకెక్కిన భారత ఏకైక రాజకీయ నాయకుడు ఆయనే.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జపాన్ ప్రధాని షింబో అబె, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్, పాక్ టీనేజ్ సంచలనం మలాలా, అమెజాన్ సిఈవో జెప్ బెజోస్, బ్రిటిష్ సింహాసనానికి కొత్త వారసుడు జార్జ్లతోపాటు అమెరికా జాతీయ భద్రత సంస్థ గుట్టురట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ పేరు కూడా పరిశీలనలో ఉండటం గమనార్హం.
ఇక టైటిల్ విజేతను నిర్ణయించేది సంపాదకవర్గమే. "మంచిగానో, చెడ్డగానో ఈ ఏడాది వార్తల్లోకెక్కినవారిలో ఎవరిని అత్యంత ప్రభావశీలిగా భావిస్తున్నదీ ఓటుద్వారా తెలియజేయండి'' అని పాఠకులను కోరింది.
ఈ నెల 20 దాకా సాగిన ఆన్లైన్ పోలింగ్లో మోడీ 2,650 ఓట్లతో (25 శాతం) అగ్రస్థానంలో ఉండగా, స్నోడెన్ 7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.