చైనా ఎఫెక్ట్ : ఇండియా - అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, జీఎస్పీపై భారత్ పట్టు
వాషింగ్టన్/ న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్ అమెరికా దేశాల మధ్య పరిమిత స్థాయిలో వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయన ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇరు దేశాధినేతలు భేటీ కానున్నారు. పలు అంశాలపై మోడీ-ట్రంప్ ద్వయం చర్చించనుంది.
అమెరికా చూపు భారత్ వైపు
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందాలు శుభసూచకమని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం నడుస్తున్నందున చైనాకు పొరుగు దేశంగా ఉన్న భారత్ వైపు అమెరికా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చేవారంలో జపాన్ ప్రధాని షింజో అబేతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జపాన్లో తయారయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం తగ్గించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉత్పత్తులపై సుంకం తగ్గింపే ప్రధాన అజెండా
ఇక మోడీ ట్రంప్ సమావేశంలో కొన్ని అమెరికా ఉత్పత్తులపై సుంకం తగ్గించేలా ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికాకు ఎగుమతి అవుతున్న భారత ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేలా ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్-మోడీలు ఆదివారం హూస్టన్లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాదాపు 50వేల మంది ఇండో అమెరికన్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఒక భారత ప్రధానితో కలిసి ఒక అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇది చరిత్రలో తొలిసారి కావడం విశేషం.
జూన్లో భారత్కు జీఎస్పీ హోదా రద్దు చేసిన అమెరికా
ఈ ఏడాది జూన్లో భారత్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే పలు ఎగుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందులో రసాయనాలు, ప్లాస్టిక్స్, లెదర్, రబ్బర్ గూడ్స్, ఆటో విడిభాగాలు ఉన్నాయి. 1970 నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా ప్రభుత్వం జీఎస్పీ హోదా కింద ఇస్తున్న బెనిఫిట్స్ వినియోగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉండేది. అమెరికా ప్రభుత్వం జీఎస్పీ రద్దు చేయడంతో భారత్ కూడా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై అధిక సుంక విధించింది.
జీఎస్పీ హోదాను డిమాండ్ చేస్తున్న భారత్
ఇక రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చల్లో భాగంగా భారత్కు ఎగుమతి కానున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని ట్రంప్ కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా బాదంపప్పు, పోర్క్, డెయిరీ ఉత్పత్తులు, చెర్రీలు, యాపిల్స్తో పాటు ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నట్లు వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి. భారత్లోకి ఎగుమతి అవుతున్న అమెరికా వస్తువులపై ఉన్న అధిక సుంకాన్ని తగ్గించుకోవాల్సిందిగా ట్రంప్ సర్కార్ డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఇది జరగాలంటే జీఎస్పీ తిరిగి మరికొన్నేళ్ల పాటు కొనసాగించాలని భారత్ పట్టుబడుతోంది. అంతేకాదు ద్రాక్షాలను అమెరికాకు ఎగుమతి చేసేలా అనుమతులు ఇవ్వాలని భారత్ కోరే అవకాశం ఉంది. అమెరికాలో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి కూడా సుంకం తగ్గించాలని అమెరికా కోరనుంది.