జపాన్ ప్రధాని షింజో అబేకి.. మోడీ శుభాకాంక్షలు
జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి అక్కడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి అక్కడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ ప్రధానికి అభినందనలు తెలిపారు. జపాన్ దిగువ సభలో పాలక కూటమికి మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కింది. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ గెలుపు ఉపకరిస్తుందని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
'ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలు... ఈ గెలుపు భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో మేలి మలుపుకు శ్రీకారం చుడుతుంది..' అని మోడీ తన ట్వీట్లో తెలిపారు.
465 మంది సభ్యులు కలిగిన జపాన్ పార్లమెంట్ దిగువ సభలో పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి 312 స్థానాల్లో గెలుపొందింది. ఉత్తర కొరియాతో ముప్పు పెరుగుతున్న క్రమంలో తాజాగా ప్రజల తీర్పు పొందేందుకు షింజో అబే గత నెలలో పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.