'భారత్-చైనా ప్రపంచాన్ని మార్చగల శక్తులు, మరింత కఠినంగా ఉండబోం'
బీజింగ్: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసుకునేందుకు భారత్ - చైన సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్ నిర్ణయించారు.
భవిష్యత్తులో డొక్లామ్ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోడీ - జిన్పింగ్ల మధ్య అనధికారిక సదస్సు శనివారం సరిహద్దులో ఉద్రిక్తలను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశంపై చర్చించారు.
అతిపెద్ద దేశాలుగా ప్రయోజనాలు చూసుకోవాలి
సరిహద్దుల్లో ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా సంస్థాగత ఏర్పాట్లను బలోపేతం చేసుకోవాలనీ, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలనీ అవగాహనకు వచ్చారు. సరిహద్దుపై సహేతుకమైన, పరస్పరం అంగీకారయోగ్యమైన పరిష్కారానికి వచ్చే బాధ్యతను ప్రత్యేక ప్రతినిధులకు అప్పగించాలని నిర్ణయించారు. రెండు అతిపెద్ద దేశాలుగా- ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోజనాలను చూసుకోవాల్సి ఉందని నేతలు ఉద్ఘాటించారు.
మరింత పరిపక్వతతో పరిష్కరించుకోవాలి
రెండు దేశాలు మంచి మిత్రులుగా ఉండాలని, ప్రపంచాన్ని మార్చడంలో మనం క్రియాశీల శక్తులుగా ఉండాలని, దాపరికం లేని, సకారాత్మక, సమ్మిళిత దృక్పథంతో, ఒకరి ఉద్దేశాలను ఒకరు సరిగ్గా విశ్లేషించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే మరింత పరిపక్వతతో పరిష్కరించుకోవాలని జిన్ పింగ్ పేర్కొన్నారు. ఆధ్యాత్మికం, వాణిజ్యం, సాంకేతికత, సంప్రదాయాలు, వినోద రంగాల్లో సహకరించుకోవాలన్నారు.
భారత్ - చైనా స్నేహం బలోపేతమైతే
భారత్-చైనా స్నేహం బలోపేతమైతే రెండు దేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికీ ప్రయోజనకరమని మోడీ ట్వీట్ చేశారు. విశాల ప్రయోజనాల రీత్యా రెండు దేశాల సరిహద్దు ప్రాంతం అంతా శాంతి, సౌభ్రాతృత్వాలు కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలూ గుర్తించారని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. శాంతియుత చర్చల ద్వారా అన్ని రకాల విభేదాలను పరిష్కరించుకోవచ్చనే వివేచన, పరిపక్వత ఇద్దరు నేతల్లోనూ ఉందని, సున్నిత అంశాలు, ఆందోళనలు, ఆకాంక్షలను పరస్పరం గౌరవించుకుంటామని చెప్పారు. ఉగ్రవాదం విసురుతున్న ఉమ్మడి సవాళ్లను నేతలు గుర్తించి, దానిని ఎదుర్కోవడంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాది జైషే మహ్మద్ విషయం ప్రస్తావనకు వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ నిర్దిష్ట అంశాల జోలికి నేతలు వెళ్లలేదని చెప్పారు.
మరింత కఠినంగా ఉండబోం
పరస్పర అనుసంధాన పనులపై భారత్తో ఎలాంటి ప్రాథమిక విభేదాలు లేవని చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి కాంగ్ షుయాన్యౌ తెలిపారు. బోర్డర్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)పై మరీ కఠినంగా ఉండబోమని తెలిపారు. అఫ్గానిస్థాన్లో తమ రెండు దేశాలూ కలిసి ఆర్థిక ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.
ఈస్ట్ లేక్ తీరంలో నడక
కాగా, మోడీ, జిన్పింగ్ కలిసి ఈస్ట్ లేక్ తీరంలో కాసేపు నడిచారు. గంటసేపు పడవలో విహరిస్తూ అతిపెద్ద మంచి నీటి సరస్సు అందాలు తిలకించారు. చాలాసేపు వారిద్దరే మాట్లాడుకున్నారు. ఉల్లాసంగా, పూర్తిగాస్నేహపూరిత వాతావరణంలో ఈ పర్యటన సాగింది. అనంతరం మోడీ శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.