కుజుడి దగ్గరకు సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క, మామ్ ట్వీట్
బెంగళూరు: అంతరిక్ష పరిశోధకులకు రెండు రోజులుగా నిద్ర లేకుండా చేసిన సైడింగ్ స్ర్పింగ్ తోకచుక్క చివరికి ఎలాంటి నష్టం చేయకుండానే వెళ్లిపోవటంతో అంతరిక్ష పరిశోధన సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. కుజుడి మీద పరిశోధన నిమిత్తం పంపిన ఆర్బిటర్లన్నీ సురక్షితంగా ఉన్నట్లు నాసా ప్రకటించింది.
కిలోమీటర్కు పైగా విస్తీర్ణంతో, పెద్ద పర్వతమంత సైజులో, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో గంటకు 2 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన సైడింగ్ స్ర్పింగ్ (సీ/2013ఏ1) తోకచుక్క ఆదివారం నాడు గ్రీనిచ్ కాలమానం ప్రకారం 2గంటల 27 నిమిషాలకు అంగారకుడికి 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది.
ఇప్పటి వరకూ ఏ తోకచుక్కా అంగారకుడికి ఇంత దగ్గరగా రాలేదని ఇస్రో, నాసా సంస్థలు నిర్ధారించాయి. అత్యంత దగ్గరగా తోకచుక్క గమనాన్ని చిత్రీకరించిన అక్కడి రోబోలు పంపే చిత్రాల కోసం పరిశోధకులు ఎదురుచూస్తున్నారు.
సౌర వ్యవస్థకు బయట కోట్ల సంవత్సరాలుగా పేరుకుపోయిన మంచు, దుమ్ము, భారీ గ్రహ శకలాలను పెద్ద ఎత్తున మోసుకొచ్చిన ఈ తోకచుక్క రాకతో కుజుడి వాతావరణంపై వచ్చిన మార్పులను గమనిస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ అనుభవం రాబోయే రోజుల్లో కుజుడిపై వచ్చే మరిన్ని సవాళ్లను అధిగమించటానికి దోహదపడుతుందని నాసా అభిప్రాయపడింది. మరోవైపు, సైడింగ్ స్ప్రింగ్ పైన మామ్ ట్వీట్ చేసింది. తాను ఆర్బిట్లో ఉన్నానని, సేఫ్గా ఉన్నానని ఇస్రో ట్వీట్ చేసింది.
అంతరిక్షంలోకి బర్గర్, చిప్స్
భారీ హీలియం బెలూన్ను ఉపయోగించి లండన్కు చెందిన చోసెన్ బన్ అనే సంస్థ బర్గర్, చిప్స్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ఈ బెలూన్ ఒక ఇంటి పరిమాణంలో ఉంది. దీని ద్వారా తినుబండారాలను ఆకాశంలోకి 1.2 లక్షల అడుగుల ఎత్తులోకి పంపారు.
ఇందుకు రెండువేల పౌండ్లు ఖర్చయ్యాయి. బర్గర్, చిప్స్ ఇలా అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి. గతంలో కూడా ఈ కంపెనీ ఇలాంటి ప్రయత్నం చేసింది. అయితే, అప్పట్లో కెమెరా మొరాయించడంతో ిప్పుడు మళ్లీ నిర్వహించవలసి వచ్చింది.