ఇండోనేషియాలో కోరలు చాస్తున్న కరోనా: 10 రేట్ల తీవ్రతతో వేగంగా వ్యాప్తి, డీ614జీగా గుర్తింపు
జకార్తా: ఇండోనేషియాలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్పై పరిశోధనలను విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైరస్తో పోలిస్తే ఇది 10 రేట్లు ఎక్కువ తీవ్రత కలిగిన 'డీ614జీ' వైరస్ అని తేలింది.
డీ614జీతో వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది..
మలేషియాలోనూ ఇలాంటి వైరస్ ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియాలో కూడా అదే వైరస్ గుర్తించినట్లు జకర్తాలోని ఐజక్మాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మాలిక్యూలర్ బయాలజీ వెల్లడించింది. ఈ వైరస్ కారణంగానే వ్యాప్తి వేగంగా జరుగుతోందని పరిశోధకులు తెలిపారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆ సంస్థ డైరెక్టర్ హెరవతీ సుకోమో వెల్లడించారు.
అప్రమత్తత అవసరం..
కాగా, కరోనా వైరస్ పరివర్తనం చెందిన డీ614జీ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరిలోనే గుర్తించింది. ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ.. దీని వలన మరణాలు పెరిగే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Recommended Video
లక్షల్లో కేసులు పెరిగే ఛాన్స్
ఇండోనేషియాలో ఇప్పటి వరకు బయటపడ్డ కరోనా కేసులకంటే ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండోనేషియాలో 1,72,000కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 7300 మంది మరణించారు. కరోనా తీవ్రత ఇదేస్థాయిలో ఉంటే మరికొద్ది రోజుల్లోనే దేశంలో 5 లక్షలకుపైగా కేసులు నమోదవుతాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణలు అంటున్నారు. దేశ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ఒకవేళ పనుల నిమిత్తం వెళ్లినా మాస్కులు ధరించడం, భౌతిక దూరం లాంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.