Covid-19: బ్రిటన్లో మరణించిన భారతీయుల సంఖ్య భారత్లో కంటే ఎక్కువే..ఏం జరుగుతోంది..?
లండన్: ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కబళిస్తోంది. దాదాపు 200కు పైగా దేశాల్లో ఈ వైరస్ కల్లోలం సృష్టించింది. ఇక బ్రిటన్ దేశం కూడా ఈ మహమ్మారితో కకావికలమైంది. అయితే అక్కడ ఎక్కువగా ఉన్న భారతీయుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా మారింది. భారత్లో మృతి చెందిన వారికంటే బ్రిటన్లో కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
బ్రిటన్లో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాచింది. ఈ వైరస్ ధాటికి అక్కడ మృతి చెందిన భారతీయుల సంఖ్య దాదాపు 1000కి దగ్గరలో ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఆదివారం నాటికి బ్రిటన్లో కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 20,732గా నమోదైంది. అయితే ఇందులో ఇళ్లల్లో ఉండి మృతి చెందిన వారి సంఖ్య కలపలేదు. అంతేకాదు మరణించిన వారి కొందరి సంఖ్య అధికారిక లెక్కల్లో చేర్చలేదు. అయితే అధికారిక లెక్కల కంటే మరో 10శాతం నుంచి 50శాతం వరకు మరణాలు ఇళ్లల్లోనే జరిగాయనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. ఇక ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు కూడా బయటపెట్టడం లేదు. ఇందులో ఎంత మంది భారతీయులు ఉన్నారన్న విషయం కూడా బయటపెట్టడం లేదు.
బ్రిటన్లో మైనార్టీలుగా ఉన్న ఇతర దేశాల వారు ఎంతమంది మృతి చెందారనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే 40శాతం మంది మృతి చెంది ఉంటారని తెలుస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్య 10వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వీరిలో ఎక్కువగా భారతీయులే ఉంటారని తెలుస్తోంది. బ్రిటన్లో భారతీయుల జనాభా 1.5 మిలియన్గా ఉంది. ఇక పాకిస్తాన్ జనాభా ఒక మిలియన్ ఉంటుండగా బంగ్లాదేశ్ జనాభా 5లక్షలుగా ఉంది. ఇక కరోనావైరస్ బారిన పడిన దక్షిణాసియా వాసుల్లో సగానికి పైగా భారతీయులే ఉన్నారని డాక్టర్ నాగ్పాల్ చెప్పారు. ఇక ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్న ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఇతర దేశాలకు చెందిన వారే ఉన్నారని చెప్పారు.
బ్రిటన్లో కరోనావైరస్కు కేంద్రబిందువుగా లండన్ నగరం ఉంది. ఇక లండన్లో భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కరోనావైరస్ మరణాల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. అంత్యక్రియల కోసం భారతీయ పురోహితుల కోసం డిమాండ్ పెరుగుతోంది. దీని ద్వారానే భారతీయుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. అదే సమయంలో స్మశాన వాటికలు, ఆలయాలు, గురుద్వారాలు ఇస్తున్న సమాచారం ద్వారా కూడా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక భారత్లో జనాభా బ్రిటన్లో భారతీయుల జనాభాతో పోల్చి చూస్తే బ్రిటన్లో చోటుచేసుకున్న భారతీయుల మరణాల రేటు ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Recommended Video