బ్యాలెట్ పత్రాల లెక్కింపు 272 మంది ప్రాణాలు తీసింది !
Recommended Video
జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు.
నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
ప్రాణాలు తీసిన కౌంటింగ్..!
ఈనెల 17వ తేదీన ఇండోనేసియాలో జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ 272 మంది ప్రాణాలు తీసింది. అధ్యక్ష, పార్లమెంటరీ, స్థానిక సంస్థలకు అలా అన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కాస్ట్ సేవింగ్ కారణంతో అన్నీ ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహించారు.
వందలాది దీవులు.. 193 మిలియన్ల ఓటర్లు.. 80 శాతం పోలింగ్.. అలా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. కానీ ఓట్ల లెక్కింపు కొందరి ప్రాణాలు బలితీసుకోవడం చర్చానీయాంశంగా మారింది. ఓట్లు లెక్కిస్తున్న క్రమంలో 272 మంది ప్రాణాలు విడిచారు. మరో 1878 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఒక్కొక్కరు 5 ఓట్లు.. 77 కోట్ల పైచిలుకు
దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంతో.. ఒక్కో ఓటర్ 5 ఓట్లు వేయాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగినా.. చివరకు కౌంటింగ్ మాత్రం దెబ్బ కొట్టింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరగడంతో ఓట్ల లెక్కింపు కష్టతరంగా మారింది. 193 మిలియన్ల (19 కోట్ల 30 లక్షలు) ఓటర్లలో దాదాపు 80 శాతం అంటే 155 మిలియన్లు (15 కోట్ల 50 లక్షలు) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
15 కోట్ల 50 లక్షల మంది ఓటర్లు ఒక్కొక్కరు 5 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అలా 77 కోట్ల 50 లక్షల బ్యాలెట్ పేపర్లు లెక్కించాల్సి వచ్చింది. ఆ క్రమంలో కౌంటింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో 272 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోట్లల్లో బ్యాలెట్ పేపర్లు.. చేతులతో లెక్కింపు
విరామం లేకుండా రోజంతా కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు వేల సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు చేతులతో లెక్కపెట్టాల్సి రావడం.. తీవ్ర అలసటకు గురి కావడం.. తదితర కారణాలతో 272 మంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యం పాలైన మరో 1878 మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది ఇండోనేసియా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
గులాబీ Vs కమలం.. ఇంటర్ ఫలితాలపై పోరుబాట.. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడి నిరవధిక దీక్ష
దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
పని వత్తిడి కారణంగానే ఓట్ల లెక్కింపు సిబ్బంది చనిపోయారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎక్కువ పనిగంటలు వారి చావుకు కారణమయ్యాయని ఆరోపిస్తూ అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం మే 22వ తేదీన నాటికి దేశవ్యాప్తంగా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. బ్యాలెట్ పేపర్లు కోట్లల్లో ఉండటం.. కౌంటింగ్ సిబ్బంది ఇలా చనిపోవడం.. ఇదంతా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.