పాక్ కు డబుల్ ఢమాకా: ఇటు భారత్ అటు ఇరాన్ దాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బపడింది. ఇటు భారత్ సైన్యం పాక్ ఉగ్రవాదుల భరతం పట్టిన సమయంలో అటు ఇరాన్ సైన్యం పాకిస్థాన్ మీద దాడి చేసింది. అంతే పాక్ తాము ఏటు చూడాలో అర్థంకాక నానా తంటాలుపడుతుంది.
భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ మతిపోగొడితే అదే సమయంలో పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో ఇరాన్ సైన్యం పాక్ మీద దాడి చేసింది. ఇరాన్ బోర్డర్ గార్డ్స్ దళాలు పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరిపాయి.
బలూచిస్థాన్ ప్రాంతంలోకి మూడు మోర్టర్లను ప్రయోగించాయి. ఇరానీ బోర్డర్ గార్డ్స్ పేల్చిన మోర్టార్ షెల్స్ పంజ్ గూర్ జిల్లాలో పడ్డాయని బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఆ మోర్టార్ షెల్స్ లో రెండు సరిహద్దు దళాల చెక్ పోస్టుల సమీపంలో పడ్డాయి.
ఒకటి కిల్లి కరీమ్ ప్రాంతంలో పడిందని పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక పాక్ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. ఇరాన్ దాడి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు హడలిపోతున్నారు.
విషయం తెలుసుకున్న పాక్ సైనికులు సరిహద్దు ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. పాక్ బలగాలు భారీగా ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో మొహరిస్తున్నాయి. పాకిస్థాన్-ఇరాన్ మధ్య సరిహద్దు 900 కిలో మీటర్లు దూరం ఉంది.
సరిహద్దులో పాకిస్థాన్ పదేపదే ఉగ్రదాడులను ప్రోత్సహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. పాక్, ఇరాన్ సైనిక దాళాల మధ్య గతంలో (ఇరాన్ భూభాగంలో) కాల్పులు జరిగాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలని 2014లో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.
పాక్ ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఉగ్రవాదాన్ని పోత్సహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. పాక్ కు భారత్ సరైన బుద్ధి చెప్పిన సమయంలోనే ఇరాన్ పాక్ మీద విరుచుకుపడింది. ఇటు భారత్ అటు ఇరాన్ దాడి చేయ్యడంతో పాక్ అయోమయంలో పడింది.