'తల్లి ద్వారా తల్లి కాబోతున్న మహిళ..'
లండన్ : క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన ఓ మహిళ, తాను చనిపోయేముందు తల్లిని ఓ చివరి కోరిక కోరింది. ఇక తాను చావుకు దగ్గరవుతుండడంతో, తల్లి కావాలనుకున్న తన కోరికను తీర్చాలని తన తల్లిని కోరింది. తన అండాలను తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా తన పిల్లలకు జన్మనివ్వాలని చనిపోయే ముందు ఆ మహిళ తన తల్లిని ప్రాధేయపడింది.
కూతురు చివరి కోరికను అర్థం చేసుకున్న తల్లి, 60 ఏళ్ల వయసులోను తల్లి కావడానికి సిద్దపడింది. అయితే ఈ తల్లి కూతుళ్ల ప్రయత్నాలకు ఆసుపత్రి వర్గాలు మాత్రం బ్రేక్ వేశాయి. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉండడంతో చనిపోయే మహిళ అండాలను ఆమె తల్లి గర్భంలో ప్రవేశపెట్టడానికి నిరాకరించారు వైద్యులు.
దీంతో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన ఆ అమ్మమ్మ ఏళ్లుగా కోర్టులు చుట్టూ తిరిగితే ఇన్నాళ్లకు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వెలువడింది. అయితే ఆమె కూతురు మాత్రం 2011 లోనే క్యాన్సర్ తీవ్రంగా మారడంతో మరణించింది. బ్రిటన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ తల్లి కూతుళ్ల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు తల్లి కూతుళ్ల పేర్లను మాత్రం అక్కడి మీడియా వర్గాలు, కోర్టులు గోప్యంగా ఉంచుతూ వస్తున్నాయి.
దీన్నొక అరుదైన కేసుగా ప్రస్తావిస్తూ కోర్టు ఇటీవలే తుది తీర్పు వెలువరించింది. 'తీవ్రమైన వ్యాధి కారణంగా బాధపడుతుండడంతోనే తల్లి కావాలన్న తన కోరికను తీర్చాలని సదరు మహిళ ఆమె తల్లిని కోరిందని, వ్యాధిగ్రస్తురాలైన ఆమెకు తల్లి అయ్యే అవకాశం లేకపోవడంతోనే ఆ కోరిక కోరింది కాబట్టి ఇందులో తప్పేమి లేదని' ప్రకటించింది.
దీంతో కూతురు చనిపోక ముందు సంతాన సాఫల్య కేంద్రంలో నిల్వ చేసిన కూతురి అండాల ద్వారా తల్లి కావడానికి సిద్దమవుతోంది ఆ అమ్మమ్మ.