బాహుబలి శివగామిలా: కొడుకు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి
లాస్ ఏంజిల్స్: బాహుబలి సినిమాలో శివగామి (రమ్యకృష్ణ) బాహుబలిని (ప్రభాస్) కాపాడేందుకు.. అతనిని తన చేతులతో పైకెత్తి పట్టుకొని, ఆమె మాత్రం నీట మునిగి చనిపోతుంది. ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది.
అయితే, దాదాపు ఇలాంటి హృదయ విదార సంఘటన నిజంగానే జరిగింది. అచ్చం సినిమాలో వలె ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళ తన ప్రాణాలు పోతున్నా.. తన కొడుకు మాత్రం బతకాలనుకుంది. శివగామిలాగే కొడుకును ఎలాగోలా ఒడ్డుకు చేర్చి ఆమె మాత్రం ప్రాణాలను విడిచింది.
ఈ సంఘటన ఇటీవల అమెరికాలోని కొలరాడోలో జరిగింది. నీళ్లలో పడిన రెండేళ్ల వయసు కొడుకును కాపాడుకునే క్రమంలో ఓ తల్లి తన ప్రాణాలను విడిచింది. తాను మునిగిపోతూ కూడా తన బిడ్డను అలాగే నీళ్లపై తేలే విధంగా ఎత్తి పట్టుకుంది.
ఛెల్సీ రస్సెల్ అనే 33 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పోవెల్ సరస్సులోని ఓ హౌస్ బోట్లో విహారయాత్రలో భాగంగా కుటుంబంతో సహా విడిది చేసింది. ఈ సమయంలో ఆమ కొడుకు నీళ్లలో పడిపోయాడు.
వెంటనే చెల్సీ రస్సెల్ నీళ్లలకి దూకింది. అదే సమయంలో హౌస్ బోట్ను ఆపేసరికే తల్లీబిడ్డలకు అది చాలా దూరంగా వచ్చేసింది. ఈ లోగా ఛెల్సీ కుటుంబ సభ్యుడొకరు ఓ చిన్న పడవను వారి వద్దకు తీసుకు వచ్చారు. తల్లి ఛాతీపై ఉన్న బిడ్డను, నీళ్లలో అపస్మారకంగా పడి ఉన్న ఛెల్సీని పైకి తెచ్చారు. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.