గగనతలంలో అనూహ్య ఘటన: విమానం ప్రమాదంలో ఒక మహిళ మృతి
ఫిలడెల్ఫియా: డల్లాస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం-1380 అనుకోని ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాలతో గగనతలంలోనే విమానం ఇంజన్ పేలిపోయింది. పేలిన ఇంజన్ శకలంలో విమానంలోకి దూసుకురావడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో.. ఇంజన్ నుంచి లీకైన గ్యాస్ విమానంలోకి వచ్చి చేరడంతో.. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు. దీంతో అందరికీ ఆక్సిజన్ మాస్కులు అందించినప్పటికీ.. దురదృష్టవశాత్తు జెన్నిఫర్ అనే ఓ మహిళ మృతి చెందారు. న్యూ మెక్సికో గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. వెల్స్ ఫార్గో బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
నా భర్త చేతిని గట్టిగా పట్టుకున్నా:
'ప్రమాద సమయంలో నా భర్త చేతిని గట్టిగా పట్టుకుని, మనసులోనే దేవున్ని ప్రార్థించాను. నా పిల్లలను మళ్లీ చూస్తానో లేదో అని కలవరపడ్డాను.' అని ఓ ప్రయాణికురాలు వెల్లడించారు.
కాగా, విమానం 30,000 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఇంజన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని.. దానివల్లే ప్రయాణికులకు ఊపిరాడలేదని అన్నారు.