కాలిఫోర్నియాలో వరద బీభత్సం: బురదలో చిక్కుకుని 13మంది మృతి
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 13మంది మృతి చెందారు. మరో 20మంది వరకు బురద వరదలో గల్లంతయ్యారు.
తుఫాను కారణంగా కాలిఫోర్నియాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వెంచురా కౌంటీలో ఏకంగా 5.5అంగుళాల వర్షపాతం నమోదైంది. ఇటీవల వేల ఎకరాల్లో అడవి దగ్ధమైన నేపథ్యంలో వరదను కట్టడి కాలేదు. దీంతో వరద ఉధృతి ఎక్కువైంది.
శాంతా బర్బారా సమీపంలోని మౌంటు సిటీలో నీటి ప్రవాహానికి కొండలపై నుంచి భారీగా బురద, బండరాళ్లు కొట్టుకువచ్చి జనావాసాలపై పడ్డాయి. ఈ కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలువురు మృత్యువాత పడగా, మరికొంత మంది గల్లంతయ్యారు.
అప్రమత్తమైన అధికారులు యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింది చిక్కుకున్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అనేక రహదరులపై బురద నిలిచిపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కాగా, ఓ వైపు గడ్డ కట్టిస్తున్న చలి, మరో వైపు వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి.