ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్కు 10 ఏళ్లు జైలు శిక్ష
ఇస్లామాబాద్: ముంబై 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రవాద కేసుల్లో దోషిగా నిర్థారించిన కోర్టు అతనికి ఈ శిక్ష విధించింది. గతేడాది జూలై 19న హఫీజ్ను లాహోర్లో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు కోర్టు ఇతనిపై నాలుగు తీర్పులు వెలువరించింది. ఇక పదేళ్ల జైలు శిక్షతో పాటు అతని ఆస్తులను కూడా సీజ్ చేయాలని అదే సమయంలో రూ. 1,10,000 జరిమానా విధించింది.
ఇక హఫీజ్తో పాటు అతని సన్నిహితుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కికి ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. వీరు ఉగ్రకార్యకలాపాల కోసం నిధులు సమీకరించారనే ఆరోపణలపై హఫీజ్ సయీద్, అబ్దుల్ రెహ్మాన్లను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. రెండు వారాల క్రితమే నిషేధిత జమా-ఉద్-దవాలోని టాప్ నాయకులకు 16 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. వీరిలో హఫీజ్ సయీద్ బావ కూడా ఉన్నాడు. యాంటీ టెర్రరిజం కోర్టు వీరందరికీ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇక జస్టిస్ ఇజాజ్ అహ్మద్ తన తీర్పును చదువుతున్నప్పుడు జేయూడీ నాయకులంతా కోర్టు హాలులోనే ఉన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక ఆష్రాఫ్, ఇక్బాల్లకు 16 ఏళ్ల జైలుశిక్ష విధించగా, మక్కీకి ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు 1,70,000 జరిమానా విధించడం జరిగిందని కోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో హఫీజ్ సయీద్కు 11 ఏళ్లు శిక్ష విధిస్తూ లాహోర్లోని ఏటీసీ కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం హఫీజ్ సయీద్ లాహోర్లోని కోట్ లాక్పథ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక పాకిస్తాన్లో పలు నగరాల్లో ఉగ్రకార్యకలాపాలు నిర్వహించేందుకు హఫీజ్ సయీద్ నిధులు సమకూర్చారని పేర్కొంటూ మొత్తం 23 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు.
హఫీజ్ సయీద్పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా అగ్రరాజ్యం అమెరికా ముద్ర వేయడంతో పాటు అతని అప్పగించిన వారికి 10 మిలియన్ అమెరికా డాలర్లను బహుమానంగా ప్రకటించింది. లష్కరే తొయిబా సంస్థ తరపున జమా ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు సయీద్ నాయకత్వం వహించాడు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి వెనక హఫీజ్ సయీద్దే మాస్టర్ మైండ్ అని విచారణ సంస్థలు తేల్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు.