#MumbaiTerrorAttack: అమెరికాలో సెగ: ప్రవాస భారతీయుల నిరసన: కొత్త అధ్యక్షుడు బిడెన్పై భారం
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. న్యాయం చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. బిల్ బోర్డులను అమర్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ సహా పాకిస్తాన్, టర్కీ రాయబార కార్యాలయాల ముందు వారి నిరసన ప్రదర్శన కొనసాగింది. వారి డిమాండ్ ఒక్కటే- ముంబైపై మహోగ్రదాడికి పాల్పడిన దేశాలను శిక్షించడం. తమ డిమాండ్కు కొత్త అధ్యక్షుడు జో బిడెన్ సానుకూలంగా స్పందిస్తాడని ఆశిస్తున్నారు.
26/11 దాడుల చరిత్రలో మరో ఏడాది..
2008, నవంబర్ 26. భారత చరిత్రలో చీకటి అధ్యాయం. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై ఉగ్రమూకలు విరుచుకుపడిన రోజు అది. కనిపించిన వారిపై కనిపించినట్టే బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఉగ్రదాడుల్లో 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ప్రతిష్ఠాత్మక తాజ్ హోటల్, నారిమన్ హౌస్ బిజినెస్ సెంటర్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేసన్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులు ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపరిచాయి. ఈ దాడులకు పాల్పడిన వారిలో కసబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు. అతణ్ని 2012లో ఉరి తీశారు.
పాకిస్తాన్ సహా టర్కీ..
కసబ్ను విచారించడం ద్వారా ముంబైపై ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానేనని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీనికి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించగలిగింది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు వాటిని అప్పగించింది. అయినప్పటికీ- పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే- అమెరికాలోని ప్రవాస భారతీయులు.. న్యాయం చేయాలంటూ నినదించారు. వాషింగ్టన్ డీసీలో నిరసన ప్రదర్శనలను చేపట్టారు.
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న దేశాలపై..
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలపై ఇప్పటికైనా కఠిన చర్యలను తీసుకోవాలని, మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. వుయ్ డిమాండ్ జస్టిస్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. ఈ ఘోరానికి పాల్పడిన 12 సంవత్సరాల తరువాత కూడా పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ప్రోత్సాహిత దేశాలపై ఎలాంటి కఠిన ఆంక్షలు ఉండట్లేదని అన్నారు. పాకిస్తాన్ను కట్టడి చేయకపోవడం వల్లే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ తరహా దాడులు మరిన్ని చేపట్టడానికి పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు కుట్రలు పన్నుతారని హెచ్చరించారు.
Recommended Video
కొత్త అధ్యక్షుడిపై భారం..
కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద దాడుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిరసనలను చేపట్టినట్లు తెలిపారు. భారత్ పట్ల జో బిడెన్ ప్రభుత్వం సానుకూల ధోరణిలో కనిపిస్తోందని, తన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వారికి కీలక బాధ్యతలను అప్పగించడమే దీనికి నిదర్శనమని అన్నారు. అదే వైఖరిని భారత్పై కొనసాగిస్తూ.. తరచూ దాడులకు పాల్పడుతోన్న ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే దేశాలపై కఠిన ఆంక్షలను విధించాలని కోరుతున్నామని అన్నారు.