అమెరికాలో మళ్లీ కాల్పులు: ఈ సారి కాల్పులు జరిపింది ఒక ఉద్యోగి...12 మంది మృతి
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో 12 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా బీచ్లోని మున్సిపల్ సెంటర్లో శుక్రవారం ఈ కాల్పులకు దుండగుడు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన వ్యక్తిపై ఎదురు కాల్పలు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
కాల్పలు జరిపిన వ్యక్తి స్థానిక మున్సిపల్ ఆఫీసులు చాలా ఏళ్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు వర్జీనియా బీచ్ పోలీసులు. ఇది వర్జీనియా బీచ్ నగర చరిత్రలోనే అత్యంత పాశవికమైన చర్యగా అభివర్ణించారు బాబీ డయర్. మృతి చెందిన వారిలో తమ సహోద్యోగులు, పొరుగువారు, స్నేహితులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మున్సిపల్ సెంటర్లోని రెండవ బిల్డింగ్లో చోటు చేసుకుంది.
గాయపడ్డ వారిని వర్జీనియా బీచ్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఎఫ్బీఐ అధికారులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కాల్పులు జరిగిన ప్రాంతం సముద్ర ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంది. వర్జీనియా బీచ్లో దాదాపు 4,50000 మంది జనాభా ఉంది. ఇక కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమాచారం ఇచ్చినట్లు వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.