హఫీజ్ సయీద్ అంటే ఇష్టం: కుత్సితాన్ని వెళ్ళగక్కిన ముషార్రఫ్
భారత్ పట్ల పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ తన వ్యతిరేకతను ప్రదర్శించారు. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటే తనకు ఇష్టమని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: భారత్ పట్ల పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ తన వ్యతిరేకతను ప్రదర్శించారు. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటే తనకు ఇష్టమని ఆయన అన్నారు. కాశ్మీర్లో భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న లష్కరే తోయిబాకు తాను మద్దతుదారుడినని చెప్పుకున్నారు.
ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషార్రఫ్ మంగళవారం రాత్రి ఓ టీవీ షోలో కనిపించి ఆ వ్యాఖ్యలు చేశారు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాకు చెందిన వారు తనను ఇష్టపడుతారనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. మీరు ఎల్ఈటి వ్యవస్థాపకుడు సయీద్ను ఇష్టపడుతారా అని అడిగితే అవునని ఆయన జవాబిచ్చాు.
ఇటీవలే తాను సయీద్ను కలిసినట్లు కూడా ముషార్రఫ్ చెెప్పారు. కాశ్మీర్లో చర్యకే తాను ఎల్లవేళలా అనుకూలంగా ఉంటూ వచ్చినట్లు తెలిపారు. కాశ్మీర్లో భారత సైన్యంపై ఒత్తిడి తేవడం అవసరమని, అందుకు ఎల్ఈటి పెద్ద శక్తి అని ఆయన అన్నారు.
ముంబైలో 2008లో జరిగిన దాడుల్లో ఎల్ఈటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. తాను లిబరల్, మోడరేట్ అని, అయితే తాను మతసంబంధమైన ప్రజలకు తాను వ్యతిరేకిని కానని ఆన అన్నారు. సయీద్ను పాకిస్తాన్ అరెస్టు చేయాలనే అమెరికా డిమాండ్ను ప్రస్తావించినప్పుడు అది దాడి చేసే భాష అని, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి అది అవమానమని ఆయన అన్నారు.
తమకు ఆదేశాలు జారీ చేయవద్దని, తాము చూసుకుంటామని, తాము తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అమెరికాను ఉద్దేశించి అన్నారు.