ఫిలిప్పీన్స్ లో రామాయణ నృత్యాన్ని వీక్షించిన మోడీ, ట్రంప్, షింజో
‘మహారదియా లవాన’ అంటే ఏమిటో తెలుసా? మన భాషలో ‘రామాయణం’. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .
మనీలా: 'మహారదియా లవాన' అంటే ఏమిటో తెలుసా? మన భాషలో 'రామాయణం'. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .
అంతేకాదు, మన రామాయణ గాథను ఆధారం చేసుకుని ఫిలిప్పీన్స్ వాసులు 'సింగ్కిల్' అనే నృత్యరూపకాన్ని రూపొందించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.
మన ప్రధాని మోడీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడ ఆసియాన్ సదస్సు స్వర్ణోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనీస్ ప్రధాని లీ కెఖియాంగ్, జపాన్ ప్రధాని షింజో అబే హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శితమవుతోన్న రామాయణాన్ని డొనాల్డ్ ట్రంప్తో కలిసి మోడీ, షింజో అబే తిలకించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేదికపై వేసిన ఆ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రెండు రోజులు జరిగే ఆసియాన్ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు.