ఇథియోపియా విమాన ప్రమాదం, 157 మంది మృతి: '2 ని.లు' అతని ప్రాణాలు కాపాడింది
ఆడిస్ అబాబా: ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదం నుంచి ఒకరు రెండు నిమిషాల వ్యవధిలో బతికి బయటపడ్డారు. ఆ రెండు నిమిషాల కారణంగా అతను విమానం ఎక్కలేదు. దీంతో బతికి బయటపడ్డారు. గ్రీకు దేశానికి చెందిన ఆంటొనీ మావ్రోపోలస్ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడు.
చదవండి: ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం, బోయింగ్ 737లో సిబ్బంది సహా 157 మంది
రెండు నిమిషాలు ఆలస్యం బతికించింది
నైరోబిలో జరుగనున్న ఐక్య రాజ్య సమితి పర్యావరణ సదస్సుకు హాజరు కావడానికి అడిస్ అబాబా నుంచి బయలుదేరారు. కానీ కొన్ని కారణాల వల్ల విమానాశ్రయానికి రెండే రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే విమానం వెళ్లిపోయింది. అదే విమానం ప్రమాదానికి గురింది. రెండు నిమిషాల ఆలస్యం అతనిని బతికించింది.
మరో విమానాన్ని బుక్ చేసుకున్నాడు కానీ
ఆ తర్వాత అతను అందుబాటులో ఉన్న మరో విమానానికి టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ విమానాశ్రయ సిబ్బంది అతనిని అనుమతించలేదు. అక్కడి సిబ్బంది అతనిని పోలీసు స్టేషన్కు తరలించారు. మీరు గొడవ చేయడం కాదని, దేవుణ్ని ప్రార్థించండని ఓ పోలీసు అధికారి అతనితో చెప్పాడు. మీరు ఎక్కాల్సిన విమానం కనిపించకుండా పోయిందని, అందులో ఎక్కాల్సిన మీరు ఒక్కరు మాత్రమే ఎక్కలేదని చెప్పాడు. ఆ తర్వాత అది ప్రమాదానికి గురైనట్లుగా తెలిసింది.
అతనిని ఎందుకు అరెస్ట్ చేశారంటే
అయితే, కూలిపోయిన విమానం అప్పటికే వెళ్లిపోవడంతో మరో విమానం కోసం అతను టిక్కెట్ బుక్ చేసుకున్నప్పటికీ పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్ తరలించడానికి కారణం ఉంది. ఆ విమానం ఎక్కనందుకు పోలీసులు అతనిని అనుమానించి పూర్తి వివరాలు తీసుకున్నారు. అతను చెప్పిన వివరాలను ధ్రువీకరించుకున్న అనంతరం వదిలిపెట్టారు.