మియన్మార్ సైనిక కుట్ర: నిరసన ప్రదర్శనల్లో గాయపడిన యువతి మృతి
మియన్మార్ సైనిక కుట్రకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలలో ఒక యువతి చనిపోయారు. మియా త్వే త్వే కెయింగ్ అనే 20 ఏళ్ల యువతి గత వారం పోలీసులు రబ్బర్ బులెట్లు, వాటర్ క్యానన్లు ప్రయోగించినప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బులెట్ గాయమైన ఆ యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆ యువతి చనిపోయారు.
ఆంగ్ సాన్ సూచీని సైనిక కుట్రతో గద్దె దింపడాన్ని వ్యతిరేకిస్తూ మియన్మార్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
మృతి చెందిన యువతి సోదరుడు యే హుట్ ఆంగ్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నేను విషాదంలో కూరుకుపోయాను. ఏమీ మాట్లాడలేకపోతున్నాను" అని అన్నారు.
తలకు గాయమైన ఆ యువతిని ఫిబ్రవరి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆస్పత్రిలో ఉండగానే ఆమె 20వ పడిలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఆమె లైఫ్ సపోర్టుతోనే ఉన్నారు. ఆమెకు గాయమైనప్పుడు ఒక పేరు చెప్పని మెడికల్ ఆఫీసర్తో బీబీసీ మాట్లాడింది. ఆమె తలకు తీవ్రమైన గాయమైందని ఆ ఆఫీసర్ బీబీసీతో చెప్పారు.
అడ్డొచ్చే నిరసనకారులకు 20 ఏళ్ల జైలు శిక్ష... సైన్యం హెచ్చరిక
మియన్మార్లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారు సైనిక బలగాలను అడ్డుకుంటే 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని మిలిటరీ హెచ్చరించింది.
సైనికాధికారులను ధిక్కరించడం లేదా వారి పట్ల ద్వేషం పెంచేలా ప్రయత్నించేవారికి ఇంకా ఎక్కువ కాలం శిక్షలు, జరిమానాలు పడతాయని సైన్యం తెలిపింది.
ఈ ప్రకటనకు ముందు, దేశంలోని పలు నగరాల్లోని వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు కనిపించాయి. ఇంటర్నెట్ను దాదాపు పూర్తిగా నిలిపివేశారు.
ఉత్తర ప్రాంతంలోని కచిన్ రాష్ట్రంలో నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
ఫిబ్రవరి ఒకటో తేదీన కుట్ర చేసిన సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది ప్రజాప్రతినిధులను నిర్బంధించింది. దీనికి వ్యతిరేంగా దేశంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/RapporteurUn/status/1361025118642843649
సైన్యం ప్రజల మీద యుద్ధం ప్రకటించిందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి టామ్ ఆండ్రూస్ ఆరోపించారు. ఈ చర్యలకు సైనిక జనరల్స్ను బాధ్యత వహించేలా చేస్తామని చెప్పారు.
- ఆంగ్ సాన్ సూచీ: మియన్మార్లో దశాబ్దాల సైనిక పాలనకు తెరదించిన నేత మళ్లీ సైనిక దిగ్బంధంలో...
- మియన్మార్ సంక్షోభం: ఆ దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?
సైన్యం సంయమనం ప్రదర్శించాలని పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాలు విజ్ఞప్తి చేశాయి.
యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్లు సంతకం చేసిన ఒక ప్రకటనలో, ''చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కూలదోయటంపై నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారులపై హింసకు పాల్పడవద్దని భద్రతా బలగాలను మేం కోరుతున్నాం’’ అని పేర్కొన్నాయి.
ఆంగ్ సాన్ సూచీ పార్టీ నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో మోసం జరిగిందని సైన్యం అంటోంది. సూచీ సారథ్యంలోని పౌర ప్రభుత్వాన్ని సైనిక కుట్ర ద్వారా తొలగించింది.
సూచీ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. వందలాది మంది ఉద్యమకారులు, ప్రతిపక్ష నాయకులను కూడా నిర్బంధించారు.
- మియన్మార్ సంక్షోభం: సైనిక పాలకులు ఫేస్బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు?
- మియన్మార్లో భారత్ ఏం కోరుకుంటోంది.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్నా.. సైనిక పాలననా
అణచివేత సంకేతాలు ఏమిటి?
దేశవ్యాప్తంగా సైన్యానికి వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనకారులు వరుసగా తొమ్మిదో రోజూ ప్రదర్శనలు నిర్వహించారు.
కచిన్ రాష్ట్రంలోని మైట్కీనా నగరంలో.. సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులతో భద్రతా బలగాలు తలపడ్డాయి. ఈ సందర్భంగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే వారు రబ్బరు బుల్లెట్లు పేల్చుతున్నారా లేక నిజమైన బులెట్లు పేల్చుతున్నారా అనేది ఇంకా తెలీదు.
సైన్యం అరెస్టు చేసిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు.
సైనిక కుట్ర జరిగిన తర్వాత మొదటిసారిగా యాంగాన్ నగర వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు సంచరిస్తూ కనిపించాయి. బౌద్ధ సన్యాసులు, ఇంజనీర్లు అక్కడ ప్రదర్శనకు సారథ్యం వహించారు.
ఇక రాజధాని నగరం నేపీటాలో మోటార్సైకిళ్ల మీద ప్రదర్శన నిర్వహించారు.
ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మియన్మార్లోని టెలికామ్ ఆపరేటర్లు చెప్పారు.
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాక ఇంటర్నెట్ ట్రాఫిక్ సాధారణ స్థాయి నుంచి 14 శాతానికి పడిపోయిందని నెట్బ్లాక్ అనే పర్యవేక్షణ సంస్థ చెప్పింది.
సైనిక బలగాలు రాత్రిళ్లు ఇళ్ల మీద దాడులు చేస్తున్నాయని నేపీటాలోని ఒక ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ఒకరు బీబీసీకి తెలిపారు.
''కర్ఫ్యూ విధిస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని వారు ప్రకటిస్తారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పోలీసులు, సైనికులు మావంటి వారిని అరెస్ట్ చేసే సమయం ఇదే’’ అని ఆ వైద్యుడు వివరించారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరు వెల్లడించడం లేదు.
''ఆ ముందు రోజు వారు ఒక ఇంటి ముందుకు వచ్చి, కంచెను కత్తిరించి, ఇంట్లోకి అడుగుపెట్టి జనాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అందుకే నాకు కూడా ఆందోళనగా ఉంది’’ అని చెప్పారాయన.
https://twitter.com/ACSRangoon/status/1360948903705600000
మియన్మార్లో ఉన్న అమెరికా జాతీయులు కర్ఫ్యూ సమయంలో ఇళ్లలోనే ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
ఏడుగురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటానికి వారెంట్లు జారీ చేశామని సైన్యం శనివారం నాడు ప్రకటించింది. అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలను హెచ్చరించింది.
అయితే, జనం ఆంక్షల్ని ధిక్కరిస్తూ రావడం వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. భద్రతా బలగాలు రాత్రిపూట దాడులు చేస్తున్నపుడు కుండలు, పళ్లాలు చరుస్తూ తమ పొరుగువారిని హెచ్చరిస్తున్నారు.
ఎవరినైనా 24 గంటలకన్నా ఎక్కువ సేపు అరెస్టు చేయటానికి, ప్రైవేటు ఇళ్లలో సోదాలు చేయటానికి కోర్టు ఆదేశాలు అవసరమని చెప్పే చట్టాలను కూడా సైన్యం శనివారం నాడు సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- '18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)