రోహింగ్యాల ఘాతుకం: 23మంది చిన్నారుల ఊచకోత, 99మందిని హతమార్చారు
నైపీడా: మయన్మార్లో రోహింగ్యా ఉగ్రవాదుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రోహింగ్య ఉగ్రవాదుల అరాచకాలపై ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టి ఇంటర్నెషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. గత సంవత్సరం రోహింగ్యా ఉగ్రవాదులు మయన్మార్లోని ఉత్తర రకైన్ రాష్ట్రంలో మారుమూల గ్రామాలపై దాడి చేసి సుమారు 99 మంది హిందువులను ఒకేసారి నరికి చంపారని అమ్నెస్టి ఇంటర్నెషనల్ తన నివేదికలో పేర్కొంది.
ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 25న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తన నివేదికలో వెల్లడించింది. అదే రోజు రోహింగ్యా ఉగ్రవాదులు పలు పోలీస్ స్టేషన్లు, పోస్టులపై కూడా దాడులు చేశారు. అర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఆర్సా)ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది.
ఆహ్ నౌక్ఖా మంగ్ సైకి గ్రామాన్ని చుట్టుముట్టిన రోహింగ్యా ఉగ్రవాదులు స్థానికులను బయటకు తీసుకొచ్చారు. వీరిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. కత్తులు, రాడ్లు చేతబట్టుకున్న ఆ ఉగ్రవాదులు గ్రామస్థులను దారుణంగా ఊచకోత కోశారని స్థానిక మహిళ ఒకరు అమ్నెస్టికి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది పురుషులు, 10 మంది మహిళలు, 23 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో 14 మంది వయస్సు 8ఏళ్లకంటే తక్కువే కావడం గమనార్హం..
వీరిందరి మృతదేహాలను గ్రామానికి సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశంలో సామూహికంగా ఖననం చేశారు. వీటిని సెప్టెంబర్లో కనుగొన్నారు. మిగిలిన వారి మృతదేహాల ఆచూకీ తెలియలేదు. దీంతోపాటు ఈ గ్రామానికి సమీపంలోని యె బౌక్ క్యార్ అనే గ్రామంలో 46మంది కూడా అదృశ్యమైపోయారు. దీంతో రెండు గ్రామాల్లో కలిపి 99 మందిని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోందని పేర్కొంది.
కాగా, గత సెప్టెంబర్లో మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై దాడులు అంతర్జాతీయ సమాజం నిరసనలకు కారణమయ్యాయి. ఈ సమయంలోనే సామూహిక ఖననం జరిగిన ఓ ప్రదేశాన్ని ప్రభుత్వ బలగాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో మృతులు రోహింగ్యాలై ఉంటారని తొలుత భావించారు. కానీ పరిశోధన తర్వాత రోహింగ్యా ఉగ్రవాదుల చేతిలో మరణించిన హిందువులని తేలింది. రోహింగ్యా ఉగ్రవాదులే ఇలా ఘోరమైన హత్యలకు పాల్పడుతుంటే.. వారినే బాధితులుగా చూపుతూ వారికే ప్రపంచం మద్దతు తెలుపుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రోహింగ్యాల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.