సూకీ విజయ దుందుభి: అధ్యక్షురాలు కావడానికి చిక్కులు
ఢాకా: మయన్మార్ ఎన్నికల పైన ప్రపంచం యావత్తు ఆసక్తిగా చూస్తోంది. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం.. మయన్మార్తో పాటు ప్రపంచం ఎదురు చూస్తోంది. అందుకు కారణం ఉంది. మయన్మార్లో సుదీర్ఘకాలంగా సైనిక పాలన నడుస్తోంది.
దీనిని నిరసిస్తూ ఆంగ్ సాన్ సూకీ ఎన్ఎల్డీ పార్టీని స్థాపించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ఫలితంగా 1990లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సూకీ ప్రారంభించిన పార్టీ పార్లమెంటులో 81 శాతం సీట్లను గెలుచుకుంది. దీనిని జీర్ణించుకోలేని సైనిక పాలకులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమెను నిర్బంధంలో ఉంచారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఎట్టకేలకు ఆమెను 2011లో విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ మయన్మార్లో తిరిగి ప్రజాస్వామ్య స్థాపన కోసం పోరాటం చేస్తున్నారు. ఆమె సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలపై అందరు ఆసక్తిగా ఉన్నారు.
మయన్మార్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆంగ్ సాన్ సూకీ పార్టీ
మయన్మార్లో జరిగిన చరిత్రాత్మక ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) భారీ విజయం దిశగా కదులుతోంది. ఇప్పటి వరకు 106 పార్లమెంటరీ స్థానాలకు ఫలితాలు తెలిశాయి. ఇందులో ఆంగ్ సాన్ సూకీ పార్టీ 96 పార్లమెంటరీ స్థానాలు గెలుచుకుంది.
దీంతో సూకీ మద్దతుదారులు వేడుకలు చేసుకుంటున్నారు. దశాబ్దాల పాటు సైనిక పాలనలో నలిగిన మయన్మార్లో ఆదివారం ఈ కీలక ఎన్నికలు జరిగాయి. సైనిక పాలకులు 2011 వరకూ దాదాపు అర్ధ శతాబ్దం పాటు దేశాన్ని పాలించారు.
ఆ తర్వాత క్వాసీ-పౌర ప్రభుత్వం ద్వారా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఆదివారం నాటి ఎన్నికల్లో జాతీయ పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలకు ఉమ్మడిగా పోలింగ్ నిర్వహించారు. పజాస్వామ్యం దిశగా ఇదో కీలక ముందడుగుగా ప్రజలు భావిస్తున్నారు. ఓటేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
తాజా ఫలితాల్లో సైనిక మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఛైర్మన్ సహా ఆ పార్టీకి చెందిన అనేక మంది దిగ్గజాలు ఓటమిపాలయ్యారు. ఎన్ఎల్డీకి గట్టి పట్టున్న యాంగాన్లో దిగువ సభ సీట్లు 45 ఉండగా, 44 చోట్ల విజయం సాధించినట్లు ఆ పార్టీ తెలిపింది.
అక్కడున్న ఎగువ సభ సీట్లు (12) మొత్తాన్నీ కైవసం చేసుకున్నట్లు వివరించింది. యాంగాన్ రాష్ట్ర అసెంబ్లీలోని 90 సీట్లలో 87 స్థానాలను దక్కించుకున్నట్లు పేర్కొంది.
మయన్మార్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 664 సీట్లు ఉండగా, అందులో 25 శాతాన్ని సైన్యానికి ప్రత్యేకించారు. మరోపక్క ఇదే రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని చేపట్టకుండా సూకీపై ఇంకా అనర్హత కూడా ఉంది.
సూకీ అధ్యక్షురాలు కావడం కష్టమే
మయన్మార్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 59 ఎఫ్ ప్రకారం మయన్మార్ దేశస్థులు సంతతి విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కోల్పోతారు. సూకి ఇద్దరు కుమారులు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఎన్ఎల్డీకి మెజార్టీ సీట్లు వచ్చినా సూకికి అధ్యక్ష పదవి దక్కదు. దీంతో పార్టీకి చెందిన ఇతరులు అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశముంది.