పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,
పాకిస్థాన్లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పీటీఐ వార్తాసంస్థ పేర్కొన్నది. వాయువు పీల్చిన 14 మంది చనిపోయారని, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. విషవాయువు ప్రబలిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
విషవాయువు ప్రబలడంతో ప్రజలు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. అప్పటికే గాలి పీల్చిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అలా 14 మంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మిగతా వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే విషవాయువు ఏంటీ..? అదీ ఎక్కడి నుంచి ప్రబలింది అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఘటనపై మాత్రం విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.