పిల్లల ప్రాణాలు కాపాడితే తల్లికి జైలుశిక్షనా..ఆదేశంలో అదే జరుగుతోంది
ఉత్తర కొరియా... ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆదేశ నియంత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచంలోనే అత్యంత భీకరమైన వ్యక్తి కిమ్. అనుకున్నది జరగాలంటాడు అంతే. మరో మాటకు తావివ్వడు. ఎదురు తిరిగామా ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అగ్రరాజ్యం అమెరికానే బేఖాతరు చేసిన అరవీరభయంకరుడు. ఉత్తర కొరియాలో ఏది జరిగినా వార్తగానే నిలుస్తుంది. అయితే అన్నీ ఆసక్తికరమైన వార్తలే అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. తాజాగా ఉత్తరకొరియాలో ఉండే ఓ తల్లికి జైలు శిక్ష విధించారు. ఆ తల్లికి ఎందుకు జైలు శిక్ష విధించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరకొరియాలో వింత ఘటన
ఉత్తరకొరియాలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ఇంట్లో ఉన్న పిల్లలను కాపాడే ప్రయత్నం ఆ తల్లి చేసింది. ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకోగా వారిని ప్రాణాలతో కాపాడింది. అదే సమయంలో ఈమె కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. సాధారణంగా మనదేశంలో అయితే ఈ సాహసం చేసినందుకు ప్రభుత్వం సత్కరిస్తుంది. కానీ అది ఉత్తరకొరియా కదా.. ఆ శాడిజం బయటపడింది.
పిల్లలను కాపాడినందుకు తల్లికి జైలు శిక్ష
మంటల్లో చిక్కుకున్న పిల్లలను కాపాడినందుకు ఆ తల్లికి జైలు శిక్ష విధించింది. ఇదేంటి వింతగా ఉంది కదూ.. అవును పిల్లలను కాపాడిన ఆ తల్లి మంటల్లో కాలిపోతున్న ఆదేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలను బయటకు తీసుకురాలేదు. అవి మంటల్లో కాలినందుకు ఆ తల్లికి జైలు శిక్ష విధించారు. నిజంగానే వింతగా ఉంది కదూ. ఉల్లి పోతుంటే పొట్టు పోయిందని ఎవరో ఏడ్చారట. అలా ఉంది ఉత్తరకొరియా ప్రభుత్వం తీరు. ఓ వైపు ప్రాణాలు పోతుంటే అధ్యక్షుడి ఫోటోలు కాలిపోయాయని ఆ తల్లికి జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం ఆమెను అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రతి ఇంట్లో కిమ్ వంశస్తుల ఫోటోలు ఉండటం తప్పనిసరి
బయట ఉన్న తల్లిదండ్రులు ఇంటినుంచి మంటలు రావడం గమనించిన పరుగులు తీశారు. పిల్లలను కాపాడారు కానీ మంటల్లో చిక్కుకున్న ఫోటోలను సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ఇదే వారు చేసిన అతిపెద్ద తప్పు. దీంతో మంటల్లో కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు కాలిపోయాయి. ఇక అసలు విషయానికొస్తే ఉత్తర కొరియాలో ఓ నిబంధన ఉంది. దేశంలోని ప్రతి ఇంట్లో ఉత్తరకొరియాను పాలించిన అధ్యక్షుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు వారి ఫోటోలు ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు ప్రత్యేక అధికారులను అక్కడి ప్రభుత్వం నియమించింది. ఆ ఫోటోలను సరిగ్గా చూసుకోకుండా విస్మరించామా అంతే సంగతులు. అదొక పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ తల్లి విషయంలో కూడా అదే జరుగుతోంది. విచారణలో నిజమని తేలితే ఆమెకు కఠిన శిక్ష తప్పదు.
పిల్లలకు పొరిగింటి వారు సహాయం చేయకూడదు
ఇక మంటల్లో చిక్కుకున్న వారి పిల్లలకు ఎవరూ సహాయం చేయడం లేదు. తల్లి జైలులో ఉన్నందున బయట పిల్లలకు కూడా ఎవరూ సహకరించకూడదనే నిబంధన ఉంది. గాయాలతో ఉన్న చిన్నారులకు చికిత్స కూడా అందించడం లేదని డైలీ నార్త్కొరియా పత్రిక కథనం రాసుకొచ్చింది. ఇక పొరిగింటి వారు సహాయం చేద్దామన్న భయంతో సహాయం చేసేందుకు దూరంగా ఉన్నారు. అధికారులు విచారణ పూర్తి చేశాకే ఆ తల్లి తన బిడ్డలను చూసే అవకాశం ఉంటుంది.
ఇలాంటి ఘటనలు ఎన్నో...
ఇక వరదలు, అగ్నిప్రమాదంలో ఆ దేశాధ్యక్షుల ఫోటోలను కాపాడితే వారిని కిమ్ ప్రభుత్వం సత్కరిస్తుంది. కాపాడే ప్రయత్నంలో మృతి చెందితే వారిని హీరోలుగా గుర్తిస్తుంది. 2005లో జున్ యూ-సంగ్ ఉత్తరకొరియాను వీడి వెళ్లింది. 2015లో ఇలాంటి ఓ ఘటన జరిగిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరుగగా అందులో ఓ చిన్నారి మృతి చెందిందట. అయితే మృతి చెందిన చిన్నారి చేతిలో కిమ్ ఫోటో ఉన్నిందట. ఇలాంటి ఘటనలు అక్కడ చాలా జరిగాయని సంగ్ చెప్పుకొచ్చారు.