శాంతి ప్రదాత: మోడీని వరించిన సియోల్ శాంతి పురస్కారం..దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాని
సియోల్ : రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సౌత్ కొరియా ప్రభుత్వం సియోల్ శాంతి పురస్కారం అందజేసింది. 2018వ సంవత్సరానికి గాను మోడీకి ఈ పురస్కారం వరించింది. శాంతి పురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా 1300 మంది నామినేట్ కాగా ఈ అవార్డు మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీని వరించడం విశేషం. 1999లో ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధానకార్యదర్శి కోఫీ అన్నన్ను వరించింది.
మోడీని వరించిన సియోల్ శాంతి పురస్కారం
సియోల్ శాంతి పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ మాట్లాడారు. సియోల్ శాంతి పురస్కారం తనకు వచ్చిన అవార్డు కాదని ఇది భారతీయులకు దక్కిన అవార్డు అని చెప్పారు. అంతేకాదు భారత్లో నెలకొన్న శాంతి సామరస్యాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని ప్రధాని అన్నారు. గత ఐదేళ్లలో భారత్ సాధించిన విజయాలకు దక్కిన గౌరవం అని చెప్పిన ప్రధాని ఇది 130 కోట్ల భారతీయుల విజయమని వెల్లడించారు. అంతేకాదు భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని దేశం జరుపుకుంటున్న సంవత్సరంలో అవార్డు వరించడం మరింత సంతోషాన్ని కలగజేస్తోందన్నారు.
వాతావరణ పరిరక్షణకై బాధ్యత తీసుకున్న భారత్
భారత్లో జరుగుతున్న అభివృద్ధి కేవలం భారతీయులకు మాత్రమే కాదన్న ప్రధాని మోడీ.... యావత్ ప్రపంచానికి మేలు చేకూరుస్తోందని చెప్పారు. ఒక దేశంతో మరొక దేశం అనుసంధానం కలిగి ఉన్న ప్రపంచంలో నివసిస్తున్న మనం.. ఒక దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మరో దేశానికి కూడా విస్తరిస్తుందని చెప్పారు. ఇక వాతావరణ పరిరక్షణలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ముందుండి నడిపించిందని చెప్పారు ప్రధాని మోడీ. దీన్ని ఒక బాధ్యతగా భారత్ తీసుకుందని చెప్పిన మోడీ... వాతావరణం పరిరక్షణ కోసం ప్రపంచదేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు పిలుపు
ఇక కొరియాలాగే భారత్కు కూడా సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదులు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతి చర్చలు జరుపుదామనుకునే సమయానికి ఉగ్రవాదులు తెగబడి దేశంలో దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ. ఇక ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులను వారి మూలాలను పెకిలించాలని అన్నారు. అలా చేయడం ద్వారానే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని అన్నారు. అభివృద్ధి ద్వారానే యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా నిలవరించవచ్చని చెప్పారు.
మోడీని కొనియాడిన దక్షిణ కొరియా ప్రభుత్వం
ఇక మోడీకి శాంతి పురస్కారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో దక్షిణ కొరియా ప్రభుత్వం వివరించింది. ప్రధాని మోడీ తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా కృషి చేశారని కొనియాడారు. భారత్తో పాటు ప్రపంచదేశాల్లో కూడా శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేశారని ప్రశంసల వర్షం కురిపించింది దక్షిణ కొరియా. ఇక ఇప్పటి వరకు సియోల్ శాంతి పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్, బంగ్లాదేశ్ ముహ్మద్ యూనస్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్లు ఉన్నారు.