ప్రపంచం ఆరాధించే నేతల్లో గాంధీ, నరేంద్ర మోడీ
జెనీవా: యావత్ ప్రపంచం అమితంగా ఇష్టపడే నేతల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ చోటు సంపాదించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాబితాలో జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అగ్రస్థానంలో నిలిచారు.
భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో నరేంద్ర మోడీకి పదో స్థానం లభించింది. వెయ్యి మందినుంచి ఈ ఎంపికలు జరిగాయి. ఈ సర్వేలో 125 దేశాల్లోని 285 నగరాలకు చెందిన వెయ్యి మిలియన్ల మందికి పైగా పాల్గొని అభిప్రాయాలు చెప్పారు.
జాబితాలో రెండో స్థానం పోప్ ఫ్రాన్సిస్కు దక్కింది. తదుపరి స్థానాల్లో టెస్లా మోటార్స్ సీఈవో ఎలోన్ ముస్క్ (మూడవ స్థానం), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (6), వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బార్సన్ (7), యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ (8), నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్(9) ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక ఫోరం స్పందిస్తూ.. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాటం సాగించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడింది. భారత్ న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత అయిన గాంధీ జాతీయోద్యమానికి బాటలు వేసి బ్రిటీష్ వారి నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడని పేర్కొంది.