ప్రధానికి ట్రంప్ ఎమర్జెన్సీ ఫోన్కాల్: మోడీ మూడ్ ఏమీ బాగాలేదు..కలవర పడుతున్నారు: ఏ క్షణమైనా
న్యూయార్క్: భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత్తో యుద్ధానికి దిగడానికి చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్ ఇదివరకే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు సంకేతాలను ఇచ్చారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు చైనా సరిహద్దుల్లో నెలకొన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తోన్న ప్రయత్నాలు పెద్దగా ఫలించట్లేదని అంటున్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా సుముఖంగా లేదని తెలుస్తోంది.
Recommended Video
ఫ్రెండ్స్ పార్టీలో ఏమైంది? సుహారిక బావ కూడా అక్కడే:హోమిసైడల్, సూసైడ్ కేసుపై క్లారిటీ
అమెరికా అధ్యక్షుడి కలవరం
ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చైనా సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడక్ వంటి చోట్ల మనదేశ సరిహద్దు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగడం వంటి పరిణామాలు చాలాదూరం వెళ్తాయని ట్రంప్ ఆరంభంలోనే అంచనా వేశారు. అందుకే చైనాతో వైరం కొనసాగుతున్నప్పటికీ..మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముందుకొచ్చారు.
మోడీ మూడ్ ఏమీ బాగాలేదంటూ
సరిహద్దు గొడవల సందర్భంగా చైనా అనుసరిస్తోన్న విధానాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్ర ఆందోళనల్లోకి నెట్టాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తాను నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడానని, ఆయన మాటల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోందనే విషయాన్ని గ్రహించానని చెప్పారు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన వైట్హౌస్ ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాల పట్ల భారత్ ఏ మాత్రం సంతోషంగా లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అటు చైనా కూడా సంతోషంగా ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
అత్యధిక జనాభా గల దేశాలు ఇాలా..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం మంచి పరిణామం కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల్లో సుమారు కోటి 40 లక్షల మంది చొప్పున జనాభా ఉందని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సైనిక రంగాల్లో ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ఏ మాత్రం తీసిపోనివేనని ట్రంప్ చెప్పారు. అలాంటి దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనడం, అవి యుద్ధానికి దారి తీసేలా కనిపించడం వంటి అవాంఛనీయ సంఘటనలు క్రమంగా చోటు చేసుకుంటున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ ఓ అడుగు ముందుకేసినా..
సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ ఓ అడుగు ముందుకేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ ట్వీట్ చేశారు. దీనికి చైనా తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ.. తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని, యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని శ్రీవాస్తవ్ వెల్లడించారు. యుద్ధానికి దిగాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పారు.