Unseen Pics of Mars: అంగారకుడి కొత్త చిత్రాలు విడుదల చేసిన నాసా... వాటిల్లో ఏముందంటే...
ఖగోళ పరిశోధనల్లో అంగారక గ్రహంపై ఇప్పటివరకూ ఎన్నో పరిశోధనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జీవం ఉందా... మానవ జాతి నివసించేందుకు అవకాశం ఉందా... ఇలా తదితర అంశాలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి... వస్తూనే ఉన్నాయి. తాజాగా అంగారక గ్రహానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నాసా విడుదల చేసింది.
ఆ చిత్రాల్లో ఏముంది...
తాజాగా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ చిత్రీకరించిన అంగారకుడి చిత్రాలను నాసా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇందులో మూడు చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో రాతి నిర్మాణాలు,మరో చిత్రంలో ఇసుక దిబ్బలు,మూడో చిత్రంలో మంచుతో గడ్డ కట్టిన ప్రదేశం కనిపిస్తున్నాయి. మొదటి చిత్రంలో రాతి నిర్మాణాలు మెట్లు మెట్లుగా ఉండటం గమనించవచ్చు. రెండో చిత్రంలో కనిపిస్తున్న ఇసుక దిబ్బ క్షేత్రాలు శీతాకాల సమయంలో చిత్రీకరించినవి.ఇక మూడో చిత్రంలో మంచు పలకల్లా పరుచుకుపోయిన ఆ ప్రదేశం అంగారక దక్షిణ ధ్రువంలో చిత్రీకరించినది.
అంగారకుడిపై మట్టిని తీసుకొచ్చే ప్రయత్నాలు....
అంగారకుడిపై అసలు ఏముందో తెలుసుకునేందుకు దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అంగారక గ్రహం నుంచి మట్టిని తీసుకొచ్చేందుకు నాసా ప్రయోగాలు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడి పైకి పంపించిన పర్సివరెన్స్ రోవర్ ద్వారా అగస్టు మొదటివారంలో ఈ ప్రయోగం జరగనుంది. అక్కడి రాతిపై డ్రిల్లింగ్ ద్వారా ఆ నమూనాలను పర్సివరెన్స్ రోవర్ సేకరించనుంది. మట్టి సేకరణ ప్రక్రియకు దాదాపు 11 రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మట్టిని పర్సివరెన్స్ రోవర్ భూమి మీదకు తీసుకొచ్చాక పరిశోధనలు జరపనున్నారు. అయితే దీన్ని భూమి పైకి తీసుకొచ్చేందుకు మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. 2031 నాటికి ఆ నమూనాలు భూమి పైకి వచ్చే అవకాశం ఉంది.
Recommended Video
ఈ ఒక్క ఏడాది 3 అంతరిక్ష నౌకలు...
అంగారకుడి మట్టిని విశ్లేషించడం ద్వారా అంగారకుడిపై జీవం ఉనికితో పాటు భూమి,సూర్యుడి పుట్టుకకు సంబంధించిన లోతైన అవగాహనకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. అంగారకుడిపై నీటి సరస్సులు ఉన్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉప్పు నీటి సరస్సులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఒక్క ఏడాదే మూడు దేశాలు అంగారకుడి పైకి అంతరిక్ష నౌకలను పంపించాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పర్సీవరెన్స్ రోవర్ను అంగారకుడి పైకి పంపించగా... చైనా టియాన్వెన్-1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ ఆర్బిటార్లను పంపించాయి.భవిష్యత్తులో అంగారకుడికి సంబంధించిన కీలక విషయాలు,చిత్రాలు వీటి ద్వారా వెలుగుచూడనున్నాయి.