అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు...ఆడియో విడుదల చేసిన నాసా
వాషింగ్టన్ : భూకంపం గురించి మనము ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం... వింటూనే ఉంటాం. కానీ ఇతర గ్రహాలపై ప్రకంపనలు వచ్చాయని ఎప్పుడైనా విన్నారా..? కానీ అది జరిగిందని చెబుతోంది ప్రముఖ అంతరిక్ష పరిశోదనా కేంద్రం నాసా. ఇంతకీ ప్రకంపనలు ఏ గ్రహంలో వచ్చాయి.. అవి ఎలా రికార్డ్ అయ్యాయి..?
అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు
అంగారకుడిపై ప్రకంపనలు వచ్చాయి. ఈ విషయాన్ని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తెలిపింది. అంగారకుడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అక్కడికి దిగిన మార్స్ లాండర్ ఈ సమాచారాన్ని నాసా కేంద్రానికి చేరవేసింది. తొలిసారిగా అంగారకుడిపై ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు నాసా తెలిపింది. అంగారకుడిపై ప్రకంపనల విషయంలో కొన్ని నెలలుగా వేచిచూశామని శాస్త్రవేత్తలు చెప్పారు. గ్రహం నుంచి వచ్చిన సమాచారం పరిశీలిస్తే అక్కడ ప్రకంపనలు ఇంకా క్రియాశీలకంగానే ఉన్నట్లు అర్థమవుతోందని అన్నారు. భూమిపై వచ్చే ప్రకంపనలు మాదిరిగా మార్స్ గ్రహంపై కూడా ప్రకంపనాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదని ఎందుకంటే అంగారకుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవని చెప్పారు. గ్రహం శీతలీకరణ అయ్యే సమయంలో ఒత్తిడి పడి ఆ ఒత్తిడికి ప్రకంపనాలు వచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రకంపనల సమయంలో రికార్డ్ అయిన ఆడియో
గతేడాది నవంబరులో అంగారకుడి స్థితిగతులను పరిశోధన చేసేందుకు రోవర్ను అక్కడకు పంపడం జరిగింది. ఇది అంగారకుడిపై వాతావరణం, భ్రమణం, ప్రకంపన ప్రక్రియలపై పరిశోదనలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోవర్ ప్రకంపనల ప్రక్రియను రికార్డ్ చేసింది. ప్రకంపనల సమయంలో చిన్నపాటి శబ్దం వినిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 6న రికార్డు అయిన ప్రకంపనలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించి ఒక అంచనాకు వచ్చింది. అంగారకుడిపై ప్రకంపనల ప్రక్రియ జరుగుతోందని చెప్పేందుకు ఈ సంకేతాలే నిదర్శనమని శాస్త్రవేత్తలు చెప్పారు. వాటిని విశ్లేషించిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మరో మూడు ప్రకంపనలు కూడా రోవర్ రికార్డు చేయడం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి మార్చి 14న, ఏప్రిల్ 10 వతేదీ, ఏప్రిల్ 11వ తేదీన సంభవించాయిని చెప్పారు. ఈ ప్రకంపనలు 1969-1977 సంవత్సరాల మధ్య చంద్రుడిపై సంభవించిన ప్రకంపనాలతో పోలి ఉన్నాయని చెప్పారు.
చంద్రుడిపై జరిగిన ప్రక్రియే అంగారకుడిపై కూడా...
అంగారక గ్రహంలానే చంద్రుడిపై ప్రకంపనాలు పెద్దగా క్రియాశీలకంగా కనిపించవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై వాతావరణం మెల్లగా చల్లబడుతున్న సమయంలోనే ఈ ప్రక్రియ కనిపిస్తుందని చెప్పారు. వాతావరణం చల్లబడుతున్న సమయంలో పీడనం పెరిగి చంద్రుడిపై పగుళ్లు ఏర్పడతాయని తద్వారా ప్రకంపనాలు వస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అంగారకుడిపై కూడా ఇదే పద్దతి జరుగుతోందని చెప్పారు. ఇప్పుడున్న సమాచారంను విశ్లేషించి భవిష్యత్తులో మరింత సమాచారం దీని నుంచి రాబట్టొచ్చని సైంటిస్టులు తెలిపారు. ఇప్పుడు ఉన్న సమాచారంతో అంగారకుడిపై ప్రకంపనలు ఉన్నాయన్న సంగతి మాత్రమే విశ్లేషించిన శాస్త్రవేత్తలు... అంగారకుడి లోపల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అని చెప్పేందుకు ఈ సమాచారం సరిపోదని చెబుతున్నారు.