శ్రీలంకలో మరోసారి రక్తపాతం: ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి హత్య ,దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు
కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. ఈస్టర్ రోజున పలు చర్చీలు హోటళ్లలో ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ మారణహోమంలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మరోసారి శ్రీలంక భద్రతా గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
ముస్లింలపై వరుస దాడులు..వ్యక్తి మృతి
శ్రీలంకలో మరోసారి రక్తం ఏరులై పారింది. ఈ సారి ఉగ్రవాది దాడులతో కాదు. ఈస్టర్ మారణహోమంకు ముస్లింలే కారణమంటూ మరో వర్గంవారు దాడులకు తెగబడ్డారు. దీంతో శ్రీలంక మరోసారి అట్టుడికింది. అక్కడి ముస్లింలపై కొందరు సామూహిక దాడి చేయడంతో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. వడ్రంగి దుకాణంలో పనిచేసే వ్యక్తిపై కొందరు పదునైన మారణాయుధాలతో దాడిచేశారు. గాయపడిన వ్యక్తిని పుట్టలం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు.
శ్రీలంకలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ
ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నిర్వహించారు. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చింది ఆ దేశ ప్రభుత్వం. ముస్లింలకు చెందిన దుకాణాలు, వాహనాలకు మరో సామాజిక వర్గం వారు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీస్ చీఫ్ చందన విక్రమర్తనే సీరియస్ అయ్యారు. అదనపు బలగాలను మోహరించాల్సిందిగా కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ముస్లింల ఇళ్లు, మసీదులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
గుంపుగా కనిపిస్తే కఠిన చర్యలు
ఉత్తర కొలంబోలోని మూడు జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ కర్ఫ్యూ విధించింది పోలీస్ శాఖ. రాత్రి వేళల్లో మాత్రం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎవరే కానీ గుంపుగా తిరగరాదని కఠిన ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధింపుతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దుకాణాలు కూడా తెరవలేని పరిస్థితి శ్రీలంకలో ఉత్పన్నమైంది. శాంతి భద్రతలు అదుపుతప్పే అవకాశమున్న నేపథ్యంలోనే కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఎక్కడైనా దాడులకు తెగబడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీస్ చీఫ్ హెచ్చరించారు.