అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : రోజుకో సంక్షోభం అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తోంది. మొన్న ఇరాన్, నిన్న చైనా దేశాలతో చెలరేగిన వివాదాల నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో అలజడి చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్ నెట్వర్క్కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్ సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట పడింది. ఈ ఆదేశాల్లో ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకోని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు హువాయి.. చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్వర్క్ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ట్రంప్ చర్యను ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పై స్వాగతించారు. అమెరికా నెట్వర్క్ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు.నేషనల్ ఎమర్జెన్సీతోపాటు అమెరికా మరో చర్య కూడా తీసుకొంది. దీని ప్రకారం హువావేపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదు. ఈ చర్యతో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీనిపై చైనాకు చెందిన హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది. తాము ఏ ప్రభుత్వానికి లోబడి పనిచేయడంలేదని తెలిపింది. తమతో వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన అమెరికా భద్రంగా ఏమీ ఉండదని పేర్కొంది. తమతో వ్యాపారం వదులుకొని ఖరీదైన ప్రత్యామ్నాయాలవైపు అమెరికా మళ్లుతోందని తెలిపింది. అమెరికా అర్థంలేని ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది.