అవినీతి కేసు: లాహోర్లో దిగగానే నవాజ్ షరీఫ్, కుమార్తె మర్యమ్ల అరెస్ట్, పదేళ్ల జైలు
లాహోర్: మరో రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పాకిస్థాన్లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. లాహోర్ విమానాశ్రయంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
లండన్లో అక్రమాస్తులు సంపాదించారని పనామా పత్రాలు వెల్లడించిన కేసులో లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షరీఫ్ ప్రయాణిస్తున్న విమానం తొలుత ఇస్లామాబాద్కు మళ్లించినట్టు పాక్ మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. అయితే, చివరకు ఆయన విమానం లాహోర్ విమానాశ్రయంలో దిగగానే బయటకు వచ్చిన వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని భారీ భద్రత మధ్య రావల్పిండి జైలుకు తరలించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య కుల్షుం చికిత్స కోసం ఇన్నాళ్లు లండన్లో ఉన్న షరీఫ్.. జైలుశిక్ష అనుభవించేందుకు వీలుగా శుక్రవారం స్వదేశానికి బయల్దేరారు. శుక్రవారం ఉదయం అబుదాబీ చేరుకున్న షరీఫ్, మరియం సాయంత్రం లాహోర్కు బయల్దేరారు. విమానం ఆలస్యం కారణంగా వీరి రాక ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.
#WATCH Nawaz Sharif and Maryam Nawaz have been arrested upon landing in Lahore from Abu Dhabi pic.twitter.com/W95bR4rkYp
— ANI (@ANI) July 13, 2018
లండన్లో అక్రమాస్తులు కల్గిఉన్నారన్న కేసు న్యాయస్థానం జులై 6న నవాజ్కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల పాటు జైలు శిక్షవిధించిన విషయం తెలిసిందే. కాగా, నవాజ్ షరీఫ్ రాక సందర్భంగా లాహోర్ సహా పాక్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లాహోర్లో ఏకంగా పది వేలమంది పోలీసులు మోహరించారు. అయినా కూడా పలు చోట్ల షరీఫ్ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. కాగా, లాహోర్ విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన పాకిస్థాన్ ముస్లింలీగ్ కార్యకర్తలు సహా వందలాది సంఖ్యలో ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.