యస్! వాజపేయికి వెన్నుపోటు పొడిచా: నవాజ్ షరీఫ్
లాహోర్: పదిహేడేళ్ల క్రితం జరిగిన కార్గల్ యుద్ధం గురించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్గిల్ వార్ ద్వారా నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిను తాము వెన్నుపోటు పొడిచామని ఆయన అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆనాడు ముంచుకొచ్చిన ఉపద్రవం నుంచి తనను తాను రక్షించుకునేందుకు నాటి భారత ప్రధాని వాజపేయికి వెన్నుపోటు పొడిచానని ఆయన చెప్పాడు. మంగళవారం నవాజ్ షరీఫ్.. ముజఫరాబాదులో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
కార్గిల్లో పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టడం ద్వారా మీరు నాకు వెన్నుపోటు పొడిచారని నాటి భారత ప్రధాని వాజపేయి తనతో అన్నారని చెప్పాడు. నాడు వాజపేయి చెప్పింది అక్షరాలా నిజమని నేడు నవాజ్ షరీఫ్ అన్నాడు. ఆయన స్థానంలో నేను ఉన్నా ఈ మాటే చెప్పేవాణ్ణని అన్నాడు.
వాజపేయి వెన్నుపోటుకు గురైన మాట వాస్తవమని, కానీ అప్పటి ఆ ఉపద్రవం నుంచి నేను ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయగలనని చెప్పాడు. ఇదే సమయంలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రూపంలో ఒక అడ్డుగోడ ఉన్నా.. ఇరు దేశాల ప్రజలంతా ఒక్కటేనని చెప్పాడు.