ఇద్దరు మృతి: భారత్ దాడులపై పార్లమెంట్లో పాక్ ప్రధాని ప్రకటన
ఇస్లామాబాద్: తాము యుద్ధానికి వ్యతిరేకమని, శాంతి కావాలని, కాశ్మీర్తో సహా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. యూరీ ఉగ్రదాడి అనంతరం పీఓకేలోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ దాడులలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో నవాజ్ షరీఫ్ పాక్ పార్లమెంట్లో బుధవారం కీలక ప్రకటన చేశారు.
బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యూరీ ఉగ్రదాడితో పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. యూరీ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఎటువంటి విచారణ నిర్వహించకుండా, పాకిస్థాన్పై భారత్ ఆరోపణలు చేసిందని అన్నారు. పాక్ను శాంతి కాముక దేశంగా అభివర్ణిస్తూ భారత్తో తాము యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని షరీఫ్ స్పష్టం చేశారు.
కాశ్మీర్ అంశంపై భారత్తో చర్చలు నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ ఆ దేశం ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. దీంతో కాశ్మీర్తో సహా భారత్తో నెలకొన్న అన్ని సమస్యలను శాంతియుతంగ పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా కాశ్మీరీ యువత తిరుగుబాటు చేశారని ఆయన పేర్కొన్నారు.
కాశ్మీర్ సమస్య విషయంలో ఐరాస తీర్మానాలను ప్రపంచ దేశాలు అమలయ్యేలా చూడాలని అన్నారు. ఇక భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్పై స్పందిస్తూ నియంత్రణ రేఖ వద్ద జరిగిన దాడుల్లో ఇద్దరు సైనికులు చనిపోయారని, భారత్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పారు.
తమ ప్రమేయం లేకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తిప్పికొట్టేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్లో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు యుద్ధం ప్రకటించాలని భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు గాను పొలాల్లోకి యుద్ధ ట్యాంకర్లను తీసుకెళ్లడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించలేమని అన్నారు.
కాగా, పాకిస్థాన్ పార్లమెంట్ను ఉద్దేశించి షరీఫ్ ప్రసంగానికి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) హాజరుకాలేదు. అసలు తాము నవాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిగా గుర్తించడం లేదని, అలాంటప్పుడు ఈ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనే సమస్యే లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడలేక పోతున్న షరీఫ్ రాజీనామా చెయ్యాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం, రాయివిండ్లో తాము చేపట్టిన ర్యాలీ గురించి ఒక్కముక్క కూడా ఉభయసభల సమావేశంలో చర్చించరని తనకు తెలుసని అన్నారు.