నువ్వో పిరికిపందవి, దమ్ముంటే రా: ముషారఫ్పై నవాజ్ షరీఫ్ నిప్పులు
కరాచీ: పాక్ పదవీచ్యుత నవాజ్ షరీఫ్ ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ పైన మండిపడ్డారు. ముషారఫ్ ఓ పిరికిపంద అన్నారు. వెంటనే న్యాయవ్యవస్థ అతనిని వెనక్కి రప్పించి అతడు చేసిన నేరాలన్నింటికీ శిక్షలు విధించాలన్నారు.
ముషారఫ్ రాజద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2007 నవంబర్ నెలలో పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి విధించి ఆయన తప్పు చేశారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి.
ఆ సమయంలో జడ్జిలను సైతం అరెస్ట్ చేయించడమే కాకుండా వారి అధికారాలను కూడా కుదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమని తేలితే ముషారఫ్కు ఉరిశిక్ష పడుతుంది.
అనారోగ్యం పేరుతో దుబాయ్కు వెళ్లి ఉంటున్న ముషారఫ్ను వెనక్కి రప్పించాలని, అతడో పెద్ద పిరికిపంద అని, విదేశాల్లో దాక్కుంటున్నాడని, అతడికి ఏ మాత్రం ధైర్యం ఉన్నా దేశంలో అడుగు పెట్టి కేసులు ఎదుర్కోవాలని నవాజ్ షరీఫ్ అన్నారు.