సైనిక పాలనా?.. మరో ప్రధానా?, పాక్ లో ఇప్పుడేం జరగబోతోంది!?
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా నేపథ్యంలో.. ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ, పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన మరో వ్యక్తిని దేశ ప్రధానిగా నియమిస్తారా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ ప్రధాని పదవికి తప్పనిసరిగా రాజీనామా చేసి, కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి నవాజ్ షరీఫ్ నెట్టివేయబడగా, తదుపరి ఆ దేశ భవిష్యత్తు ఏంటన్న విషయమై ఆసక్తి నెలకొంది.
పాక్ ప్రధాని షరీఫ్ ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షరీఫ్ రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ, పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన మరో వ్యక్తిని ప్రధానిగా నియమిస్తారా? లేక పాలనను సైన్యం తన అధీనంలోకి తీసుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దీటైన నాయకుడే లేరా?
ప్రస్తుతం అధికార పీఎంఎల్-ఎన్ లో నవాజ్ షరీఫ్ కు దీటైన నాయకుడు మరొకరు లేకపోవడం అతిపెద్ద లోటుగా కనిపిస్తోంది. ఆయన కుమార్తె మర్యామ్ నవాజ్ ఇప్పటి వరకూ పెద్దగా ప్రజా జీవితంలో, క్రియాశీల రాజకీయాల్లో లేకపోగా, సోదరుడు షహబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితమై ఉన్నారు. షహబాజ్ షరీఫ్ కు ఒకే ఒక్క ప్రావిన్షియల్ స్థానం మాత్రమే ఉండటంతో ప్రధాని పదవిని ఇప్పటికిప్పుడు ఆయన స్వీకరించే వీలు కూడా లేదని తెలుస్తోంది.
Recommended Video
మూడుసార్లు ప్రధామంత్రి అయినా...
ఇప్పటివరకూ నవాజ్ షరీఫ్ మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా, ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ఆయన పదవిలో లేరు. 1993లో ఆయనపై లంచాల ఆరోపణలు రాగా తొలిసారి ప్రధానిగా తొలగించబడ్డారు. ఆపై 1999లో సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్, నవాజ్ నుంచి అధికారాన్ని లాక్కొన్నారు. ఇప్పుడు మూడోసారి ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకుండానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సైన్యం జోక్యం లేకుంటే...
ఈ నేపథ్యంలో ముందుగా తనకు నమ్మకస్తుడు, రక్షణ మంత్రి అయిన ఖ్వాజా ఆసిఫ్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించి, ఆపై తన సోదరుడిని ప్రధానిగా చేసేందుకు నవాజ్ షరీఫ్ ఎత్తులు వేయవచ్చని కూడా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇదంతా సైన్యం ముందడుగు వేయకుండా ఉన్నప్పుడే జరుగుతుంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు...
పనామా గేట్ వ్యవహారం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు పదవీగండం తెచ్చి పెడితే, మరోవైపు ఈ పరిణామం అక్కడి స్టాక్మార్కెట్లను అశనిపాతంలా తాకింది. దీంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ షాక్ తగలడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన భారీ అమ్మకాలకు దారి తీసింది. దాదాపు అన్ని సూచీల్లోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కోర్టు తీర్పు పై అంచనాల నేపథ్యంలో ఆరంభంలో ఒక దశలో 1200 పాయింట్లు పడిపోయిన సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుని 45వేల మార్క్ వద్ద స్థిరపడింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల్లోనే అక్కడి మార్కెట్లు క్రాష్ అయ్యాయి. కరాచీ స్టాక్మార్కెట్ ఇండెక్స్ కెఎస్ఈ 100 700 పాయింట్లు పతనమైంది.
అసలేమిటీ ఈ పనామా కుంభకోణం...?
అధికారంలో అక్రమార్కులు! వ్యాపారాలు, వ్యవహారాల్లో గుట్టలుగా పోగేసిన నల్లడబ్బు! ఎక్కడ దాచుకోవాలో తెలియనంత సొమ్ము! ‘పన్ను' కన్నుకు చిక్కొద్దు! ఎలాంటి చిక్కులూ రావొద్దు. దీనికోసం దోచుకున్నది స్విస్బ్యాంకు ఖాతాల్లో దాచేయడం షరా మామూలే! ఇది... అంతకు మించిన వ్యవహారం! సొమ్ములు దేశం దాటించు! నల్లడబ్బుకు ‘పెట్టుబడి' కలర్ ఇచ్చేయ్! కాగితాలమీదే కంపెనీలు! ఉత్తుత్తి లాభాలు! బిందాస్! ఇవన్నీ చేసి పెట్టడానికి ఒక సంస్థ! దానిపేరే... మొస్సాక్ ఫోన్సెకా! ఇదో న్యాయసేవా సంస్థ (లా ఫర్మ్)! పన్ను ఎగవేత‘దారులకు' స్వర్గధామమైన పనామాలో ఉంది. ఫోన్సెకాకు సంబంధించిన ‘అతి రహస్య'మైన పత్రాలను కొంతమంది జర్నలిస్టులు బయటపెట్టడంతో ఈ కుంభకోణం బయటికొచ్చింది. దీనినే పనామా గేట్ కుంభకోణంగా వ్యవహరిస్తున్నారు.
నవాజ్ షరీఫ్ పాత్ర ఏమిటి?
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తన అక్రమ సంపాదనను ఆ దేశ సరిహద్దులు దాటించారు. ఆయన కుటుంబ సభ్యులు తమ నల్లడబ్బు దాచుకోవడానికి పనామాలో నాలుగు విదేశీ కంపెనీలు ఏర్పాటు చేశారు. షరీఫ్ కూతురు, కుమారులైన మర్యం, హసన్, హుస్సైన్ల పేరిట భారీ లావాదేవీలు జరిపినట్లు ఈ పత్రాల ద్వారా వెల్లడైంది. పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా సంస్థ ద్వారా వీరు వివిధ బ్యాంకులు, సంస్థల్లో ఈ నల్లడబ్బును పెట్టుబడులుగా చూపారు. ఇదంతా 1990 వ దశకంలో జరిగింది.
దోషిగా తేలడంతో... రాజీనామా
నవాజ్ షరీఫ్ పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమంగా వెనుకేసుకున్న సొమ్ముతో లండన్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోళ్లు చేశారని, పలువురు బినామీల పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోళ్లు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది. దీంతో పాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం, షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ ఆ దేశ సుప్రీం కోర్టుకు ఆయన అవినీతి బాగోతంపై ఒక నివేదిక సమర్పించింది. ఈ కేసులో దోషిగా తేలడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.