ఘోర కలి: దంతాల కోసం 100 ఏనుగుల ఊచకోత
జోహన్నెస్బర్గ్: ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. బోట్స్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే స్మగ్లర్లు ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం.
ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగితే సుమారు వంద ఏనుగులు విగతజీవులై కనిపించాయి. జూలై 10వ తేదీనుంచి ఈ అన్వేషణ మొదలైంది.
ప్రతిరోజూ ఇంకా కళేబరాలు కనిపిసూనే ఉన్నాయని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఆఫ్రికాలో ఇంతఘోరం జరగలేదని ఆయన వాపోయారు. బోట్స్వానా ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత ఊచకోత చోటుచేసుకున్నదని ఆయన తెలిపారు.
ఓకవాంగా డెల్టాలోని ప్రసిద్ధ సంరక్షణ కేంద్రంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. డజన్లకొద్దీ ఏనుగులను దుండగులు చంపేశారని బోట్స్వానా టూరిజం మంత్రి షెకేడీ ఖామా ధృవీకరించారు. మిగతా వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.
ఆఫ్రికాలో అత్యధిక ఏనుగుల జనాభా (సుమారు 1,35,000) ఉన్నది బోట్స్వానాలోనే. జాంబియా, అంగోలా దేశాల్లో ఏనుగుల జాతిని దాదాపుగా అంతం చేసిన స్మగ్లర్లు ఇప్పుడు బోట్స్వానా మీద పడ్డారని చేజ్ తెలిపారు. ఖడ్గమృగాలకు కూడా ఈ వేటగాళ్ల నుంచి ముప్పు ఎదురవుతోందన్నారు.