మరింత ఎత్తుకు ఎదిగిన ఎవరెస్ట్ శిఖరం: ఎత్తు ఎంత? కొత్త లెక్కలు: ఇదీ న్యూ హైట్: నేపాల్ వెల్లడి
ఖాట్మండు: ప్రపంచంలోనే అతి ఎత్తయిన, అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్నాయి. దశాబ్దాల తరబడి హిమాలయ పర్వత పీఠభూముల్లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్ల మౌంట్ ఎవరెస్ట్ ఎత్తులోనూ హెచ్చుతగ్గులు నమోదై ఉండొచ్చనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ప్రత్యేకించి- హిమాలయన్ కంట్రీ నేపాల్ను నిలువెల్లా వణికించిన భారీ భూకంపం అనంతరం.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తుపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. భూకంపం అనంతరం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గి ఉండొచ్చనే సందేహాలు తలెత్తాయి. వాటన్నింటినీ పటాపంచలు చేసింది.. నేపాల్.
మౌంట్ ఎవరెస్ట్ తాజా ఎత్తు ఎంతంటే..?
మౌంట్ ఎవరెస్ట్ తాజా ఎత్తును నిర్ధారించింది. వాటి వివరాలను ప్రకటించింది. కొత్తగా లెక్కించిన గణాంకాల ప్రకారం.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు.. 8848.86 మీటర్లు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఎవరెస్ట్ ఎత్తును 8848.86 మీటర్లుగా నిర్ధారించినట్లు వెల్లడించింది. ఎవరెస్ట్ శిఖరం పంక్తుల్లోని పీక్ సాగరమాత ఎత్తు 8848.69గా పేర్కొంది. ఇదే అత్యున్నత శిఖరాగ్రం. ఏడాదికాలం పాటు అత్యాధునిక పద్ధతుల్లో, ఈ అత్యున్నత శిఖరం ఎత్తుపై సర్వే చేపట్టినట్లు పేర్కొంది.
ఆ భూకంపం అనంతరం..
అన్ని విధాలుగా, వేర్వేరు కోణాల్లో సర్వే ను చేపట్టిన తరువాతే.. కొత్త ఎత్తును ఖరారు చేసినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి స్పష్టం చేశారు. ఇదివరకు ఉన్న ఎత్తు 8848 మీటర్లు. కాగా.. తాజా లెక్కల ప్రకారం.. దీని ఎత్తు 0.86 పెరిగింది. 2015లో సంభవించిన భారీ భూకంపం నేపాల్ను దాదాపు నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తొమ్మిది వేల మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 22 వేల మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ ఘటన నుంచి కోలుకోవడానికి నేపాల్కు చాలా సమయం పట్టింది. ప్రపంచ దేశాలన్నీ నేపాల్కు నిలదొక్కుకోవడానికి సహకరించాయి.
ఎవరెస్ట్ పైనా భూకంప ప్రభావం..
ఈ పెను భూకంపం ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం ప్రభావితం చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అంచనాలకు మించిన విధంగా.. గరిష్ఠస్థాయిలో భూమి కంపించడం వల్ల ఎవరెస్ట్ కూడా కొంత కుంగిపోయి ఉండటానికి అవకాశం ఏర్పడి ఉండొచ్చని భావించారు. దీనితో దాని ఎత్తును కొలవాలని నిర్ణయానికొచ్చింది నేపాల్. ఈ పర్వతం ఎత్తు లెక్కలపై ఇటీవల కాలంలో సందేహాలు వ్యక్తం కావడం వల్ల నేపాల్ ప్రభుత్వం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
0.86 మీటర్ల మేర..
1954లో సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. కాగా 2015లో నేపాల్లో భూకంపం వచ్చిన తరువాత దీని ఎత్తు 8848.86కు పెరిగినట్లు తాజాగా ధృవీకరించింది. ఈ మధ్యకాలంలో మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలవడం ఇదే తొలిసారి. తాజా గణాంకాల ప్రకారం.. దీని ఎత్తు స్వల్పంగా పెరిగినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి స్పష్టం చేశారు. ఈ డేటాకు చైనా కూడా అంగీకరించిందని పేర్కొన్నారు.