నేపాల్ ప్రభుత్వం తంటాలు: శ్రీరాముడు నేపాలీయుడే: నిరూపించడానికి తవ్వకాలకు: పురావస్తుశాఖ
ఖాట్మండూ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో రాజకీయ వేడిని రగిలించాయి. ఆయన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కేపీ ఓలి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మిత్రదేశంగా ఉన్న భారతతో విభేదాలను కొని తెచ్చుకోవడం, చైనా పంచన చేరేలా ఉన్న కేపీ ఓలీ వైఖరిని విమర్శిస్తున్నారు. శ్రీరాముడు నేపాలీయుడేనంటూ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి నేపాల్లో.
Recommended Video
ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనా
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని నిరూపించుకోవడానికి నేపాల్ ప్రభుత్వం తంటాలు పడుతోంది. తమ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ నిరూపించుకోవడానికి పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. శ్రీరాముడు జన్మించినట్టుగా కేపీ శర్మ ఓలీ ప్రకటించిన థోరీ ప్రదేశంలో తవ్వకాలను చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నేపాల్ పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ దామోదర్ గౌతమ్ తెలిపారు. ప్రధానమంత్రి ప్రకటన తరువాత.. థోరీలో తవ్వకాలను చేపట్టాలని నిర్ణయించుకున్నామని, దీనిపై ఓ సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు.
పురావస్తు శాఖ అధికార ప్రతినిధి రామ్ బహదుర్ కున్వర్ ఇప్పటికే థోరీ ప్రదేశాన్ని సందర్శించారని, శ్రీరాముడు జన్మించినట్లు చెబుతోన్న ప్రదేశంలో తవ్వకాలకు అనువైన వాతావరణం ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీశారని నేపాల్కు చెందిన మై రిపబ్లికా దినపత్రిక సైతం వెల్లడించింది. పురావస్తు శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి మధ్య ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు చర్చలు కొనసాగినట్లు పేర్కొంది. థోరీలో చేపట్టే తవ్వకాల కోసం విదేశీ నిపుణులను కూడా సంప్రదించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి చేసిన ప్రకటన పట్ల భారత్లో విమర్శలు చెలరేగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో వాస్తవమేమిటనేది బహిర్గతం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని దామోదర్ గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి చేసిన ప్రకటన నిజమేనని నిరూపించడానికి తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలావుండగా.. శ్రీరాముడి జన్మస్థలంపై కేపీ ఓలీ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ దుమారం చెలరేగుతోంది నేపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశంపై కేపీ ఓలీపై ఘాటు విమర్శలు చేశారు. చైనాను మెప్పించడానికి చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న భారత్తో శతృత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.