నేపాల్ భూకంపం: చెదరని 'కుమారి' ఇల్లు, ఫ్రెంచ్ గర్ల్తో నేపాల్ అబ్బాయి పెళ్లి
ఖాట్మాండ్: నేపాల్లో వచ్చిన భూకంపానికి చారిత్రక కట్టడాలు, భవంతులు ఎన్నో నేలమట్టమయ్యాయి. పశుపతినాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. దాంతో పాటే స్థానిక ఖాట్మాండు ప్రజలు దుర్గాదేవికి ప్రతిరూపంగా పూజించే తొమ్మిదేళ్ల బాలిక 'కుమారి' ఉంటున్న ఇల్లు కూడా చెక్క చెదరలేదు.
గత నెల 25వ తేదీ మధ్యాహ్నం భూమి కంపించినప్పుడు దర్బార్ స్క్వేర్లోని పలు పురాత కట్టడాలు నేలమట్టమయ్యాయి. కానీ, ఆ బాలిక నివసిస్తున్న చిన్న ప్యాలెస్ మాత్రం కొద్దిగా పగుళ్లు మాత్రమే ఇచ్చింది. నేపాల్లో సాఖ్య కులానికి చెందిన బాలికలను యుక్తవయసు వచ్చేదాకా దుర్గా దేవికి ప్రతి రూపంగా కొలవడం సంప్రదాయం.
కుమారిగా ఎంపిక చేసిన బాలికకు యుక్తవయసు వచ్చిన తర్వాత వారి స్థానంలో అదే తెగకు చెందిన మరో బాలికను ఎంపిక చేస్తారు. ప్రాసాదం ఆవరణలో నివసిస్తున్న మాజీ కుమారిల కుటుంబ సభ్యులు సైతం దుర్గామాతకు ప్రతిరూపమైన ఆ బాలికే తమను అన్ని శక్తులనుంచి కాపాడుతుందన్న నమ్మకంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లలేదట. స్థానికులు చాలామంది ఆ ఇంటికి వచ్చి తలదాచుకున్నారని తెలుస్తోంది.
ఒక్కటైన నేపాల్ అబ్బాయి, ఫ్రెంచ్ అమ్మాయి
వారం రోజులుగా భూకంపం, ప్రకంపనలలో తల్లడిల్లుతున్న నేపాల్లో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. దీపేష్ మునాకరి అనే నేపాలీ అబ్బాయికి, ఇగునే ప్రోవోస్ట్ అనే ఫ్రెంచి అమ్మాయికి ఉన్నంతలో వివాహం జరిగింది.